భారత క్రికెట్లో సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ భారత క్రికెట్ దిగ్గజాలు. రికార్డులు సృష్టించడంతో పాటు జట్టు విజయాల్లో, ప్రపంచ క్రికెట్లో భారత్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడ్డారు. బ్యాటింగ్లో కొత్త ప్రమాణాలను తీసుకొచ్చారు. వీరి ప్రదర్శనలు కొత్త తరం క్రికెటర్లకు ఎంతో స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఈ ఇద్దరూ వేర్వేరు కాలాల్లో బ్యాటింగ్ రారాజుల అయినప్పటికీ... వీరిద్దరిలో ఎవరు గొప్ప అంటూ క్రికెట్ అభిమానులు పోలుస్తూనే ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా భారత్ - న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీతో పాటు సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. కోహ్లీని 'GOAT'గా అభివర్ణించాడు. క్రికెట్ కోసం, దేశం కోసం సచిన్ టెండూల్కర్ చేసిన త్యాగం గురించి మాట్లాడాడు.

"విరాట్ కోహ్లీని సచిన్ టెండూల్కర్ తో ఎప్పుడూ పోలుస్తుంటాను. వీరిద్దరూ వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేశారు. కోహ్లీ ఆడేటప్పుడు జట్టుకు ప్రధాన కోచ్గా పని చేశాను. సచిన్తో కలిసి ఆడాను. సచిన్ కు కూడా ఫుడ్ అంటే బాగా ఇష్టపడతాడు. అందరి కుర్రాళ్లలాగా గడపాలని బాగా ఇష్టపడేవాడు. కానీ, అతడు దేశం కోసం ఆడేందుకు అన్నింటికీ దూరంగా ఉండిపోయాడు.
ఇక విరాట్ కోహ్లీని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్ అని పిలవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్రమశిక్షణ, మ్యాచ్ పరిస్థితులపై అతడికి ఉండే అవగాహనే స్టార్ని చేశాయి. పైగా అతడు క్రికెట్ కే ఆదరణను తీసుకొచ్చాడు" అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.