
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో చిత్తుచిత్తుగా ఓడిన టీమిండియా కోలుకునే ప్రయత్నంలో నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. జట్టు ఆటగాళ్లంతా గురువారం కూడా తమ ప్రాక్టీస్ను కొనసాగించారు. భారత ఆటగాళ్లు భిన్నమైన సాధన చేశారు. ఇద్దరు ఆటగాళ్లు కలిసి కుస్తీపోటీ తరహాలో సరికొత్త కసరత్తులు చేశారు. ఇక కన్కషన్ నుంచి కోలుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అందరికన్నా ముందు శిక్షణా శిబిరానికి వచ్చి దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్నాడు. బ్యాట్ పట్టుకొని వికెట్ల మధ్య పరుగు తీస్తూ ఫిట్నెస్ను నిరూపించుకునే ప్రయత్నంలో పడ్డాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన యువపేసర్ టీ నటరాజన్ నెట్స్లో చక్కగా బంతులు విసిరాడు. కెప్టెన్ అజింక్య రహానే, టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారాను బాగా ఇబ్బంది పెట్టాడు. ఆఫ్సైడ్ బంతులతో వారిని పరీక్షించాడు. కేఎల్ రాహుల్ సైతం నెట్స్లో సుదీర్ఘంగా సాధన చేశాడు. యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సైతం శ్రమించాడు. వీరిద్దరూ రెండో టెస్టులో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటగాళ్లు సాధన చేస్తుండగా.. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ వారిని పరీక్షించారు.
ప్రాక్టీస్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానేతో కోచ్లు సుదీర్ఘంగా మాట్లాడారు. బ్యాటింగ్ సెషన్ ముగిశాక కేఎల్ రాహుల్, పృథ్వీ షాతో రవిశాస్త్రి సంభాషించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో షా సాధన చేశాడు. ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ నేతృత్వంలో స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ నెట్స్లో కష్టపడ్డారు. శ్రీలంక మాజీ స్పిన్నర్ సూరజ్ రండివ వారికి బౌలింగ్ చేశాడు. ఆసీస్ పేసర్లు కూడా సుదీర్ఘంగా నెట్స్లో కష్టపడ్డారు.
శనివారం నుంచి మెల్బోర్న్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారం మూడో టెస్టు జనవరి 7నుంచి సిడ్నీలో జరగాల్సి ఉంది. అయితే నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణ సందేహంలో పడింది. ఇలాంటి స్థితిలో అవసరమైతే మెల్బోర్న్లోనే మూడో టెస్టును నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది.