
టీమిండియాలో రవీంద్ర జడేజా ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టేస్తూ.. అవసరమైనప్పుడు బ్యాటింగ్లోనూ రాణిస్తూ జట్టును ఆదుకోవడం జడ్డూ స్పెషాల్టీ. మోకాలి శస్త్రచికిత్స తర్వాత మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేసిన అతను.. వరుసగా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ' అవార్డులు అందుకుంటున్నాడు. ఆసీస్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఈ అవార్డు జడ్డూకే దక్కింది.
ఆ తర్వాత జరిగిన మొదటి వన్డేలో కూడా జడ్డూనే ఈ అవార్డు అందుకున్నాడు. 2009లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అతను.. అప్పటి నుంచి జట్టులో కీలకంగా మారాడు. భారత్ తరఫున 64 టెస్టులు, 172 వన్డేలు, 64 టీ20లు ఆడిన జడ్డూ.. జట్టును వీటిలో చాలా సార్లు ఒంటి చేత్తో గెలిపించాడు. ఇంత అద్భుతంగా ఆడుతున్న జడ్డూ ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించాడు. ఐపీఎల్ 2023 ప్రారంభానికి సన్నాహకంగా జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఫాస్ట్ బౌలర్ అవ్వాలని అనుకున్నట్లు చెప్పాడు. కానీ తన వద్ద దానికి సరిపోయే పేస్ లేకపోవడంతో వెనకడుగు వేశానని గుర్తుచేసుకున్నాడు.
'నేను చాలా కాలం క్రితం క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఫాస్ట్ బౌలర్ అవ్వాలని అనుకున్నా. మిగతా పేసర్లు బౌన్సర్లు వేయడం బాగా నచ్చేది. నేను కూడా అలాగే వేయాలని చాలా గట్టిగా అనుకునేవాడిని. కానీ నా దగ్గర పేస్ బౌలర్ అయ్యే వేగం లేదు' అని చెప్పుకొచ్చాడు. అలాగే తన క్రికెట్ జర్నీని ఇద్దరు మహేంద్రులు బాగా ప్రభావితం చేశారని గుర్తుచేసుకున్నాడు. 'ఈ విషయం నేను ధోనీకి కూడా చెప్పా. జామ్నగర్లో నా కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్తో నా జర్నీ మొదలైంది. ఇప్పుడు సీఎస్కేలో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో సాగుతోంది. నా క్రికెట్ అంతా ఇలా ఇద్దరు మహేంద్రుల మధ్యనే సాగింది' అని పేర్కొన్నాడు.