హైదరాబాద్: ఇటీవలే ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్పై 180 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది.
అనంతరం పాక్ నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 54 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 76 పరుగులు చేశాడు.
సిక్సర్లు, ఫోర్లతో చెలరేగాడు. పాండ్యా బ్యాటింగ్ చూసిన క్రికెట్ అభిమానులు భారత్ ఓటమి వ్యత్యాసం తగ్గుతుందని భావించారు. మరికొందరు అయితే చివరి వరకు పాండ్యా క్రీజులో ఉంటే భారత్ గెలుపు ఖాయమని కూడా భావించారు. ఇలా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడుతున్న పాండ్యా, జడేజా కారణంగా రనౌట్గా వెనుదిరిగాడు.
మ్యాచ్ కీలకంగా ఉన్న సమయంలో అనవసర పరుగు కోసం తనను రనౌట్ చేసిన జడేజాపై పాండ్యా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసహనంతోనే పెవిలియన్కు చేరాడు. ఈ ఘటనను స్ఫూర్తిగా తీసుకొని మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో జడేజా, పాండ్యా కొట్టుకున్నట్టుగా యానిమేషన్ వీడియో ఒకటి యూట్యూబ్లో వైరల్ అయింది.
ఈ యానిమేషన్ వీడియోలో డబ్ల్యూడబ్ల్యూఈలో రెజ్లర్లు కుర్చీలతో ఎలాగైతే కొట్టుకుంటారో అదేవిధంగా రూపొందించారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.