ఆస్ట్రేలియా టూర్కు ముందు కీలక ఆటగాళ్లు రంజీలు ఆడాలని మాజీలు సూచిస్తున్న తరుణంలో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అదే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆసియా కప్ సమయంలో మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా.. సర్జరీ తర్వాత కోలుకున్నాడు. ఇటీవలి కాలంలో గాయం నుంచి కోలుకున్న జడ్డూ.. ఆస్ట్రేలియా టూర్లో జట్టుతో కలవాలని తహతహలాడుతున్నాడు. అయితే అతను ఫిట్నెస్ నిరూపించుకుంటేనే జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇకపై గాయాల కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు దేశవాళీల్లో ఆడిన తర్వాతనే జట్టుతో కలవాలని ఇటీవలే బీసీసీఐ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత జట్టుతో కలవడానికి ముందు రవీంద్ర జడేజా కూడా సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగుతాడని తెలుస్తోంది. ఆ తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడని అనుకుంటే అతన్ని భారత జట్టులోకి తీసుకుంటారని సమాచారం. సౌరాష్ట్ర జట్టు మొత్తం అతనికి మంచి వెల్కమ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్ ముందు అతను రంజీలు ఆడతాడని ఇంత కాలం వచ్చిన వార్తలు నిజమే అని తేలిపోయింది.
2018 నవంబరు తర్వాత రవీంద్ర జడేజా మళ్లీ సౌరాష్ట్ర జట్టుతో కలిసి ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆదివారం సౌరాష్ట్ర జట్టుతో అతను కలుస్తాడని తెలుస్తోంది. నేషనల్ క్రికెట్ అకాడమీ ప్రోటోకాల్స్ ప్రకారమే జడ్డూ ట్రైనింగ్, వర్క్లోడ్ ఉంటుంది. ఆదివారం తమిళనాడుతో జరిగే మ్యాచ్లో జడ్డూ ఆడనున్నాడు. అతనితో కలిసి ఆడేందుకు తమ జట్టంతా చాలా ఎగ్జయిట్ అవుతోందని సౌరాష్ట్ర కోచ్ నీరజ్ చెప్పాడు. తను కూడా అందరితో కలిసి ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నట్లు జడ్డూ చెప్పాడట. రిషభ్ పంత్ కూడా ఆస్ట్రేలియా సిరీస్ ఆడటం లేదు. దీంతో జడ్డూ ఫిట్గా ఉండటం జట్టుకు చాలా అవసరం.