హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య జూన్ 30(శుక్రవారం) మూడో వన్డే జరగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండిస్పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దీంతో ఐదు వన్డేల సిరిస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే కోసం టీమిండియా ఇప్పటికే ఆంటిగ్వాకు చేరుకుంది. తొలి రెండు వన్డేల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. దీంతో తనకు లభించిన విరామాన్ని జడేజా మరోలా సద్వినియోగం చేసుకున్నాడు.
ఆంటిగ్వాలో వీధుల్లో సైకిల్పై చక్కెర్లు కొడుతూ దిగిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇటీవల భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని మార్క్ రుట్టే.. మోడీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. మోడీ సైకిల్పై ఎక్కి కూర్చున్న ఫొటోని రుట్టే సోషల్మీడియాలో పంచుకున్నారు.
ప్రధాని మోడీ సైకిల్ తొక్కుతున్న ఫొటోను స్ఫూర్తిగా తీసుకుని తాను సైకిల్ నడిపినట్లు జడేజా తెలిపాడు. అలాగే జడేజా తాను సైకిల్ రైడ్ చేస్తున్న ఫొటోకి మోడీ సైకిల్పై ఉన్న ఫొటో జత చేసి ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాడు. 'మోడీకి ధన్యవాదాలు. ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ మీరు స్ఫూర్తి' అని జడేజా తన ట్విట్టర్లో పోస్టు చేశాడు.