
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచులో భారత్ విజయం సాధించడంపై చాలా మంది స్పందించారు. వీరిలో ఎక్కువ మంది ఆసీస్ ఓటమికి నాగ్పూర్ పిచ్ కన్నా ఆసీస్ బ్యాటర్ల ఆటతీరే కారణమని మండిపడ్డారు. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్సులో 177 పరుగులకే ఆలౌట్ అయింది. బదులుగా భారత జట్టు 400 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్ కేవలం 91 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 132 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది.
తొలి ఇన్నింగ్సులో 5 వికెట్లు తీసుకొని హాఫ్ సెంచరీతో రాణించిన రవీంద్ర జడేజాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే తమ జట్టు విజయంపై జడ్డూ స్పందించాడు. 'వాళ్లు ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచే పిచ్పై ఉండే రఫ్ కనిపించింది. ఈ పిచ్పై బంతి భారీగా స్పిన్ అవుతుందని వాళ్లు ఫిక్స్ అయిపోయారు. కానీ అంత స్పిన్ అవ్వలేదు. మీరు ఈ మ్యాచ్ జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. వాళ్ల బ్యాటర్లు ఎక్కువగా స్ట్రెయిట్ డెలివరీలకే అవుటయ్యారు. మేం కూడా అలాంటి బంతులకే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాం' అని వివరించాడు.
అక్కడితో ఆగని జడ్డూ ఇంకా వివరణ ఇచ్చాడు. 'మేం మా జట్టు బలానికి తగ్గట్లు ఆడతాం. కాబట్టి ఇలాగే జరుగుతుంది. మా ఫాస్ట్ బౌలర్లు గొప్పగా ఆడుతున్నారు. కానీ ఇండియాలో స్పిన్నర్లే ఎక్కువ మ్యాచులు గెలిపిస్తున్నారు. ఎక్కువ వికెట్లు కూడా వాళ్లే తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మా బలానికి తగ్గట్లు ఎందుకు ఆడకూడదు?' అని ఎదురు ప్రశ్నించాడు. రెండో టెస్టులో కూడా ఇదే జోరును కొనసాగించాలని భారత్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఢిల్లీలో ఎలాంటి పిచ్ తయారు చేస్తారు? అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.