ఐపీఎల్ 2026 సీజన్ క్రికెట్ అభిమానులకు ఊహించని పరిణామాలను పరిచయం చేస్తోంది. దశాబ్ధ కాలానికి పైగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉండి.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరాడు. ఎల్లో జెర్సీలో అలవాటైన రవీంద్ర జడేజాను ఒక్కసారిగా గులాబీ రంగు జెర్సీలో చూడటం ఫ్యాన్స్కు కొత్తగా అనిపించినా.. జడేజా మాత్రం ఈ కొత్త మార్పును పూర్తిస్థాయిలో ఆస్వాదిస్తున్నాడు. గౌహతి వేదికగా తన పాత జట్టు సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత రవీంద్ర జడేజా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పింక్ జర్సీ నాకు బాగా సెట్ అయ్యింది..
మ్యాచ్ ఇన్నింగ్స్ విరామ సమయంలో రవీంద్ర జడేజా మాట్లాడుతూ.. తన కొత్త జెర్సీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "నాకు అనిపిస్తోంది.. ఈ గులాబీ రంగు జర్సీ నాకు చాలా నచ్చింది . ఈ కొత్త లుక్ను నేను ఎంజాయ్ చేస్తున్నాను" అని ఆయన నవ్వుతూ అన్నాడు. ఇన్నేళ్లు సీఎస్కేకు ప్రాణప్రదంగా ఉన్న రవీంద్ర జడేజా.. జట్టు మారగానే ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఇది ఆయన కొత్త జట్టు పట్ల చూపిస్తున్న నిబద్ధతగా మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మైదానంలో జడేజా బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే.. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆయన ఎంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నారో అర్థమవుతోంది.

ఒకే ఓవర్లో ఇద్దరిని ఔట్ చేసిన జడేజా
కేవలం మాటలతోనే కాకుండా స్టేడియంలో తన బౌలింగ్తోనూ పాత జట్టుపై రవీంద్ర జడేజా విరుచుకుపడ్డారు. సీఎస్కే ఇన్నింగ్స్ కీలక దశలో ఉన్నప్పుడు ఒకే ఓవర్లో ఇద్దరు డేంజరస్ బ్యాటర్లను ఔట్ చేసి ఆ జట్టు నడ్డి విరిచాడు. దూకుడుగా ఆడుతున్న శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్లను పెవిలియన్ పంపి, మ్యాచ్ను రాజస్థాన్ వైపు తిప్పాడు. మొత్తంగా 3 ఓవర్లు వేసిన రవీంద్ర జడేజా.. కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు సాధించాడు. శివమ్ దూబేను ఔట్ చేయడంపై స్పందిస్తూ, "శివమ్ దూబేతో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. సీఎస్కే నెట్స్లో అతనికి నేను ఎన్నోసార్లు బౌలింగ్ చేశాను, కాబట్టి దూబే స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటాడో నాకు ముందే తెలుసు" అని జడేజా తన వ్యూహాన్ని వివరించాడు.
జడేజాకు కొత్తేమీ కాదు..
నిజానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు రవీంద్ర జడేజాకు కొత్తేమీ కాదు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు జడేజా ప్రయాణం ఈ జట్టుతోనే మొదలైంది. దివంగత లెజెండ్ షేన్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు జడేజా ఆ జట్టులో కీలక సభ్యుడు. అప్పట్లో షేన్ వార్న్ ఆయనను ప్రేమగా 'రాక్స్టార్' అని పిలిచేవారు. 2012లో సీఎస్కేలో చేరిన జడేజా.. 2023 ఫైనల్లో చివరి రెండు బంతులకు ఫోర్, సిక్స్ కొట్టి చెన్నైకి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. అయితే 2026 సీజన్ ముందు జరిగిన ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా ఆయన తిరిగి తన పాత గూటికి (రాజస్థాన్) చేరుకోవడం విశేషం.
చారిత్రాత్మక ట్రేడింగ్ ద్వారా భారీ ఆశలతో రవీంద్ర జడేజాను జట్టులోకి తెచ్చుకున్న రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం.. మొదటి మ్యాచ్లోనే జడేజా ప్రదర్శన పట్ల పూర్తి సంతృప్తితో ఉంది. అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్గా రవీంద్ర జడేజా రాకతో రాజస్థాన్ జట్టు మరింత బలోపేతం అయ్యింది. ముఖ్యంగా బౌలింగ్లో జడేజా చూపిస్తున్న వైవిధ్యం జట్టుకు భారీ లాభంగా మారింది. మరి రాబోయే మ్యాచ్ల్లో కూడా ఇదే జోరును కొనసాగించి.. 2008 నాటి మ్యాజిక్ను రిపీట్ చేసి రాజస్థాన్ను మళ్ళీ ఛాంపియన్గా నిలబెడతారో లేదో చూడాలి.