రిటైన్ చేసుకున్న చెన్నై..
చెన్నై జట్టు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో తొలిపేరు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజానే. గతేడాది ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు అందుకున్న జడ్డూ.. నాయకత్వంలో ఘోరంగా విఫలం అయ్యాడు. దీంతో 8 మ్యాచులు పూర్తయిన తర్వాత మళ్లీ ధోనీకే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది మేనేజ్మెంట్. ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యల కారణంతో టోర్నీకి జడ్డూ దూరమయ్యాడు.
విభేదాలంటూ వార్తలు
ఈ క్రమంలో చెన్నై యాజమాన్యానికి, జడేజాకు మధ్య విభేదాలు తలెత్తాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అతను చేసిన సోషల్ మీడియా పోస్టులను కూడా జడ్డూ డిలీట్ చేసేశాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక మినీ వేలానికి ముందు చెన్నై జట్టుకు జడ్డూ గుడ్బై చెప్పేస్తాడని, వేలం బరిలో నిలుస్తాడని వదంతులు వ్యాపించాయి. వీటిపై చెన్నై మేనేజ్మెంట్ కానీ, జడేజా కానీ స్పందించలేదు.
ఫొటో షేర్ చేసిన జడ్డూ..
అయితే తాజాగా రిటెన్షన్ల జాబితాలో జడేజా పేరును మేనేజ్మెంట్ చేర్చింది. అతన్ని వదులుకునే ఆలోచన తమకు లేదనే సంకేతాలు పంపింది. ఈ క్రమంలో ధోనీకి తను తల వంచి అభివాదం చేస్తున్న ఫొటోను జడేజా షేర్ చేశాడు. దీంతోపాటు 'అంతా బాగానే ఉంది.. రీస్టార్ట్' అని పోస్టు పెట్టాడు. ఈ ట్వీట్ చూసిన చెన్నై ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేకుండా పోయింది. ప్రస్తుతం మోకాలి చికిత్స చేయించుకొని రీహాబిలేషన్లో ఉన్న జడ్డూ.. వచ్చే ఏడాది ఐపీఎల్ నాటికి కోలుకుంటాడని సమాచారం.