ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తమపై వరుసగా అయిదు విజయాలు సాధించిన పంజాబ్ రికార్డుకు చెన్నై ఆల్రౌండ్ షోతో చెక్ పెట్టింది. అంతేగాక ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (46; 26 బంతుల్లో, 3x4, 2x6) టాప్ స్కోరర్. రుతురాజ్ గైక్వాడ్ (32; 21 బంతుల్లో, 4x4, 1x6), డారిల్ మిచెల్ (30; 19 బంతుల్లో, 2x4, 1x6) కీలక పరుగులు సాధించారు. శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్కు చేరారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.

అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (30; 23 బంతుల్లో, 2x4, 2x6), శశాంక్ సింగ్ (27; 20 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్లు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా (3/20) మూడు, సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్పాండే (2/35) చెరో రెండు వికెట్లు తీశారు. బ్యాటుతో పాటు బంతితో సత్తాచాటిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
అయితే ఈ క్రమంలో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ప్లేయర్గా చరిత్రకెక్కాడు. పంజాబ్ కింగ్స్ మ్యాచ్తో కలిపి జడేజా ఖాతాలో 16 అవార్డులు చేరాయి. అంతకుముందు ఈ రికార్డు సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట మీద ఉండేది. ధోనీ ఇప్పటివరకు 15 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.
జడేజా, ధోనీ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా, రుతురాజ్ గైక్వాడ్, మైకేల్ హస్సీ ఉన్నారు. రైనా 12 సార్లు, రుతురాజ్ 11 సార్లు, హస్సీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. కాగా, జడేజా మరో రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఓ మ్యాచ్లో 40+ పరుగులు, 3+ వికెట్లు అత్యధిక సార్లు సాధించిన ఆల్రౌండర్ల జాబితాలో షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్లతో కలిసి జడేజా అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురు ఈ ఘనతను మూడు సార్లు సాధించారు.