
హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా సోలంకి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. ఆదివారం రాత్రి గుజరాత్లోని జామ్నగర్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ఆర్సీ ఫల్దు, ఎంపీ పూనమ్బేన్, ఎమ్మెల్యే బాకుభాయ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ప్రధాని మోడీ స్ఫూర్తి.. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు బీజేపీలో చేరాను" అని అన్నారు. రివాబా సోలంకి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.

అందుకే బీజేపీలో చేరారనే వార్తలు వినపిస్తున్నాయి. గతేడాది నవంబర్ 20న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని రవీంద్ర జడేజా, రివాబా కలిసిన సంగతి తెలిసిందే. క్షత్రియ సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కర్ణిసేనకు గుజరాత్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియామకమైన ఆరు నెలలకే రివాబా సోలంకి బీజేపీలో చేరడం విశేషం.
పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కూడా చురుగ్గా వ్యవహరించారు. 2016లో రవీంద్ర జడేజాకు రివాబాతో వివాహామైంది. ఈ దంపతులకు ఒక పాప ఉంది. రివాబా ప్రస్తుతం రాజ్కోట్లో రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. అయితే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో రాజ్కోట్ లేదా జామ్నగర్ నియోజకవర్గాల నుంచి రివాబా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.