
హైదరాబాద్: రవీంద్రజడేజా భార్య రీవా చేసిన తప్పుకు ఆమెపై ఓ పోలీస్ కానిస్టేబుల్ పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం, జామ్నగర్లోని సారూ సెక్షన్ రోడ్డులో కారులో వెళుతున్న రీవా అనుకోకుండా పోలీస్ కానిస్టేబుల్ సాజయ్ అహిర్ మోటారు సైకిల్ను ఢీకొట్టింది. దీంతో విచక్షణ మరిచిన ఆ కానిస్టేబుల్ రీవా జడేజా జుట్టు పట్టుకుని కిందకు ఈడ్చి అత్యంత అమానవీయంగా కొట్టినట్లు, చెంప దెబ్బ కొట్టి అవమానించినట్టు ప్రత్యక్షసాక్షి విజయ్సింగ్ చవడా తెలిపాడు.
ఎంతో కష్టంమీద అతని నుంచి రీవాను విడిపించగలిగినట్లు వివరించాడు. అతని నుంచి తప్పించుకున్న రీవా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జడేజాపై దాడి చేసిన కానిస్టేబుల్ను అరెస్టు చేసి శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు జామ్నగర్ ఎస్పీ ప్రదీప్ సేజుల్ తెలిపారు. రీవా జడేజాకు కావలసిన సహాయం అందిస్తామని, ఆమెపై దాడి చేసిన కానిస్టేబుల్పై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఐపీఎల్లో ఆడుతోన్న రవీంద్ర జడేజా చెన్నై సూపర్కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో వారు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో వాంఖడే స్టేడియం వేదికగా సాయంత్రం 7గంటలకు తలపడనున్నారు. ఈ ఏడాది ఐపీఎల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోగా 14మ్యాచ్లు ఆడి 9వికెట్లు తీయగలిగాడు. ఓ ఎకానమీ బౌలర్గా ఓవర్కు 7.6 పరుగుల రన్ రేట్తో కొనసాగుతున్నాడు.
చెన్నై లీగ్ దశలోని ఆఖరి మ్యాచ్ను పంజాబ్పై ఐదు వికెట్ల తేడాతో ముగించింది. ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే చెన్నైను విజయం వరించింది. మంగళవారం జరగనున్న మ్యాచ్లో హైదరాబాద్తో తలపడుతున్న చెన్నై ఇప్పటికే హైదరాబాద్ను 2 సార్లు ఓడించింది..