IND vs ENG: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 427 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అయితే, రవీంద్ర జడేజా నెమ్మదిగా ఆడటం వల్లనే భారత జట్టు కాస్త ముందుగానే డిక్లేర్ చేయలేకపోయిందని, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంకా 16 ఓవర్లు మిగిలి ఉండగానే డిక్లేర్ చేసి ఉంటే, ఇంగ్లండ్ను రెండో ఇన్నింగ్స్లో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయించి మరిన్ని వికెట్లు పడగొట్టే అవకాశం ఉండేదని కొంతమంది అభిమానులు విమర్శిస్తున్నారు.అయితే, రవీంద్ర జడేజాను భారత అభిమానులు అన్యాయంగా విమర్శిస్తున్నారని చెప్పాలి. రవీంద్ర జడేజా నెమ్మదిగా ఆడినప్పటికీ, రెండో ఇన్నింగ్స్లో 69 పరుగులు చేశాడు. జడేజా స్ట్రైక్ రేట్ 58గా ఉంది. టెస్ట్ మ్యాచ్కి ఇది మంచి స్ట్రైక్ రేటే.
జడేజా నెమ్మదిగా ఆడితేనే భారీ లక్ష్యం సాధ్యమైంది!
రవీంద్ర జడేజా ఇంకా వేగంగా ఆడటానికి ప్రయత్నించి తన వికెట్ను కోల్పోయి ఉంటే భారత జట్టు ఇంగ్లండ్కు చాలా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశిం ఉండకపోయేది. ఈ విషయంలో రవీంద్ర జడేజాను తప్పుగా విమర్శిస్తున్నారు. రవీంద్ర జడేజా నెమ్మదిగా ఆడిన ఆట ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుందాం. ఈ మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులు చేసింది. భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ స్థితిలో ఇంగ్లండ్ జట్టుకు చాలా పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించాలని టీమిండియా నిర్ణయించింది.

ఎందుకంటే మొదటి మ్యాచ్లో టీమిండియా 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఇంగ్లండ్ దానిని ఛేదించింది. అందుకే ఖచ్చితంగా 500 పరుగుల కంటే ఎక్కువ భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భారత జట్టు ప్రణాళిక వేసుకుంది.
కీలక భాగస్వామ్యాలతో భారీ స్కోరు
ఈ క్రమంలో నాలుగో రోజు ఆటలో వికెట్ కోల్పోకుండా వేగంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడి 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ దూకుడుగా ఆడారు. రిషబ్ పంత్ 58 బంతుల్లో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి బ్యాటింగ్ చేశాడు. శుభ్మన్ గిల్ ఒకవైపు దూకుడుగా ఆడుతుండగా.. రవీంద్ర జడేజా మరోవైపు నిలకడగా ఆడుతూ వచ్చాడు. శుభ్మన్ గిల్ 162 బంతుల్లో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికీ రవీంద్ర జడేజా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టీమిండియా 427 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ సమయంలో ఎందుకు డిక్లేర్ చేసిందంటే.. అప్పటికి భారత జట్టుకు 600 పరుగుల ఆధిక్యం లభించింది. అందుకే 600 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించామని నిర్ధారణకు వచ్చాకే టీమిండియా డిక్లేర్ చేసింది. రవీంద్ర జడేజా 118 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. రవీంద్ర జడేజా వేగంగా పరుగులు చేసి ఉంటే భారత జట్టు ఎప్పుడో 600 పరుగుల ఆధిక్యాన్ని అందుకుని డిక్లేర్ చేయగలిగేదని కొంతమంది అభిమానులు వాదిస్తున్నారు.
జడేజా స్థిరత్వమే జట్టుకు కలిసొచ్చింది..
అయితే రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చినప్పుడు భారత జట్టు 236 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఉంది. అప్పుడు జడేజా వేగంగా ఆడాలని అనుకుని తన వికెట్ను కోల్పోయి ఉంటే, భారత జట్టు వికెట్ల పతనం ఒత్తిడిలో చిక్కుకునేది.ఆ తర్వాత బ్యాటింగ్కు రానున్న నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తక్కువ పరుగులకే ఔట్ అయి ఉంటే, భారత జట్టు ఆ పరిస్థితుల్లో 450 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించి ఉండేది. దానిని ఛేదించడానికి ఇంగ్లండ్ జట్టు ఖచ్చితంగా ప్రయత్నించి ఉండేది.కానీ, ఇప్పుడు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం వల్ల, ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు మ్యాచ్ను డ్రా చేసుకోవాలని మాట్లాడుతోంది. అంతేకాదు, నాలుగో రోజు ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 72 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఖచ్చితంగా ఆ జట్టు ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది. ఈ ఒత్తిడికి కారణం 608 పరుగుల భారీ లక్ష్యమే.
దానిని నిర్దేశించడానికి కారణం భారత జట్టు వేగంగా పరుగులు చేయడంతో పాటు వికెట్ కోల్పోకుండా ఆడటమే. ఒకవైపు వికెట్లు పడకుండా రవీంద్ర జడేజా చూసుకున్నాడు. స్థిరంగా పరుగులు కూడా చేశాడు. మరోవైపు శుభమన్ గిల్ దూకుడుగా ఆడి పరుగులు చేశాడు. ఈ ప్రణాళిక విజయవంతం కావడంతోనే భారత జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. కాబట్టి, రవీంద్ర జడేజా ఆట ఖచ్చితంగా భారత జట్టుకు చాలా పెద్ద మొత్తంలో సహాయపడిందని చెప్పాలి.