హైదరాబాద్: మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. రాంచీ టెస్టు ముందు వరకు నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ రెండో స్ధానానికి పరిమితమయ్యాడు.
రాంచీ టెస్టులో రవీంద్ర జడేజా చేసిన అద్భుత ప్రదర్శన అతడి టెస్టు ర్యాంకుని మెరుగపరచుకునేలా చేసింది. జడేజా తన కెరీర్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. ఈ టెస్టులో జడేజా మొత్తం 9 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసిన జడేజా, ఇక రెండో ఇన్నింగ్స్లో 52 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్ రాంచీ టెస్టులో రాణించలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి అశ్విన్కి దక్కినవి కేవలం రెండు వికెట్లు మాత్రమే. దీంతో 99 రేటింగ్ పాయింట్లతో జడేజా నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు. రాంచీ టెస్టులో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసుకున్న అశ్విన్ 37 రేటింగ్ పాయింట్లు కోల్పోయి 862 రేటింగ్ పాయింట్లతో రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ టెస్టు బౌలర్ల జాబితాలో నెంబర్ వన్ బౌలర్గా నిలిచిన మూడో భారత క్రికెటర్గా జడేజా అరుదైన గుర్తింపు పొందాడు. జడేజాకు ముందు బిషన్ సింగ్ బేడీ, రవిచంద్రన్ అశ్విన్లు నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్నారు. ఇక టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తర్వాత 900 రేటింగ్ పాయింట్ల మార్కుని అందుకునేందుకు జడేజా కేవలం ఒక పాయింట్ దూరంలో ఉన్నాడు.
అంతక ముందు రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో అత్యధికంగా 904 రేటింగ్ పాయింట్లను అందుకున్నాడు. కొలంబొలో జరిగిన 100వ టెస్టులో శ్రీలంకపై బంగ్లాదేశ్ విజయం సాధించిన తర్వాత టెస్టు ర్యాంకులను ప్రకటించారు. ఈ టెస్టులో శ్రీలంకపై బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి టెస్టు సిరిస్ను 1-1తో సమం చేసుకుంది.
ఇక దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ 15 స్ధానాలు ఎగబాకి తన కెరీర్లోనే అత్యుత్తమ 37వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక భారత్కు చెందిన ఉమేశ్ యాదవ్ 26వ ర్యాంకు సాధించగా, బంగ్లా కెప్టెన్ ముస్ఫికర్ రహీం 47వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
మరొవైపు బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో పుజారా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రాంచీ టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన పుజారా ఆరో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకాడు. డబుల్ సెంచరీతో తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుని ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ను వెనక్కునెట్టాడు.
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (941 రేటింగ్ పాయింట్లు) తొలి స్థానంలో ఉండగా, పుజారా (861 రేటింగ్ పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. మరొకవైపు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. గతవారం టెస్టు ర్యాంకింగ్స్లో మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయిన కోహ్లీ అదే స్థానంలో కొనసాగుతున్నాడు.
మార్చి 21 నాటికి టెస్టుల్లో టాప్ 10 బౌలర్లు:
(Read as Rank (+/-), Player, Team, Points)
1. ( - ) రవీంద్ర జడేజా (ఇండియా) 899
2. (-1) రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా) 862
3. (+1) రంగనా హెర్నాత్ (శ్రీలంక) 854
4. (-1) జోష్ హెజల్ ఉడ్ (ఆస్ట్రేలియా) 842
5. (+2) జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) 810
6. (+2) స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్) 803
7. ( - ) డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా) 803
8. (-3) కగిసో రబడ (దక్షిణాఫ్రికా) 802
9. ( - ) ఫిలాండర్ (దక్షిణాఫ్రికా) 767
10. ( - ) నెయిల్ వాగ్నర్ (న్యూజిలాండ్) 762