ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 436 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్నైట్ స్కోరు 421/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 15 పరుగులు మాత్రమే చేసింది. చివరి మూడు వికెట్లను పది బంతుల వ్యవధిలో కోల్పోయింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యం లభించింది. రవీండ్ర జడేజా (87; 180 బంతుల్లో) సెంచరీ, అక్షర్ పటేల్ (44; 100 బంతుల్లో) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు.
అయితే జడేజా ఔట్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఔట్ కాకపోయినప్పటికీ థర్డ్ అంపైర్ నిర్ణయంతోనే జడేజా పెవిలియన్కు చేరాల్సి వచ్చిందని టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..రూట్ వేసిన బంతిని జడేజా డిఫెండ్కు యత్నించగా అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. బ్యాటుకు తగిలిందనే గట్టి నమ్మకంతో జడ్డూ రివ్యూకి వెళ్లాడు.

అయితే జడేజాకు షాక్ ఎదురైంది. బ్యాటుకు బంతి తగిలినట్లుగా తేలింది. కానీ ప్యాడ్కు తగలకముందే బ్యాటుకు తాకినట్లుగా స్పష్టత లేదు. దీంతో థర్డ్ అంపైర్ 'బ్యాట్కు ముందుగా తాకిందా లేదా అనే విషయాన్ని నిర్ణయించలేకపోతున్నాను' అని తెలిపాడు. అనంతరం ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో జడేజాను ఔట్గా ప్రకటించాడు. దీంతో అంపైర్పై విమర్శలు వస్తున్నాయి. స్పష్టత లేని విషయాల్లో ఫీల్డ్ అంపైర్ కాల్ను అనుసరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో జడేజాకు తీవ్ర అన్యాయం జరిగిందని అంటున్నారు.
కాగా, టీమిండియా బ్యాటర్లలో యశస్వీ జైశ్వాల్ (80; 74 బంతుల్లో), రోహిత్ శర్మ (24; 27 బంతుల్లో), శుభ్మన్ గిల్ (23; 66 బంతుల్లో), కేఎల్ రాహుల్ (86), శ్రేయస్ అయ్యర్ (35; 63 బంతుల్లో), జడేజా (87), కేఎస్ భరత్ (41; 81 బంతుల్లో), అశ్విన్ (1), అక్షర్ పటేల్ (44) పరుగులు చేశాడు. బుమ్రా డకౌటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్లీ చెరో రెండు వికెట్లు తీశారు.
అంతకుమందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (70; 88 బంతుల్లో) టాప్ స్కోరర్. డకెల్ (35; 39 బంతుల్లో), బెయిర్ స్టో (37; 58 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు, అక్షర్, బుమ్రా తలో రెండు వికెట్లు సాధించారు.