
భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున కెప్టెన్సీ వహించి.. ఆ భారం మోయలేక మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పకుని మళ్లీ ధోనీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్లో అత్యంత చెత్త ప్రదర్శన కూడా జడ్డూ చేశాడు. గాయం కారణంగా మధ్యలోనే ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఆటకు కాస్త విరామమిచ్చిన రవీంద్రా జడేజా ఓ మంచి పనికి పూనుకున్నాడు. జూన్ 8న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తాను చేపట్టిన మంచి పని గురించి తెలియజేశాడు. అతను, అతని భార్య రివాబా జడేజా తమ కుమార్తె 5వ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద బాలికల సంక్షేమం కోసం ఓ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. జడేజా దంపతులు గుజరాత్లోని జామ్నగర్ పోస్టాఫీసులో పేద బాలికల పేరిట 101 సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచారు. ఒక్కో సుకన్య సమృద్ధి ఖాతాలో తొలిదశలో రూ.11000 జమ చేశారు. తద్వారా ఆ బాలికలు యుక్తవయస్సు వచ్చే నాటికి ఆ జమ ఎన్నో రెట్లు పెరిగి వారి చదువుకు కానీ, వివాహానికి గానీ ఉపయోగపడుతుంది. ఈ ఖాతాల్లో జడేజా మళ్లీ మళ్లీ డబ్బులు జమ చేసే అవకాశం కూడా ఉంది.
రవీంద్రా జడేజా సామాజిక సేవలో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా జడేజా పలు నిరుపేద కుటుంబాలకు తన చేయూత అందించాడు. లాక్డౌన్ సమయంలో అనేక కుటుంబాలకు రేషన్ పంపిణీ చేశాడు. జడేజా బృందం అవసరమైన పేదప్రజలకు ఆహారాన్ని పంపిణీ చేసిందని, తాను సామాజిక సేవ చేస్తున్న విషయాన్ని పెద్దగా హైలెట్ కాకుండా సాధారణంగా ఉంచాలని జడేజా భావిస్తాడని అతని సోదరి నైనా జడేజా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.