టీమిండియా ఫ్యాన్స్కు స్టార్ క్రికెటర్ గుడ్ న్యూస్ చెప్పాడు. గాయంతో చాలా కాలంగా జట్టుకు దూరమైన అతను.. త్వరలోనే మళ్లీ టీమిండియాలో చేరతానని హింట్ ఇచ్చాడు. అతనెవరో కాదు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఆసియా కప్ సమయంలో మోకాలి గాయంతో జట్టుకు దూరమైన అతను.. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్లో కూడా ఆడలేదు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు కోలుకుంటాడని అంతా అనుకుంటే.. అప్పటికి కూడా పూర్తిగా కోలుకోలేదు.
అయితే తాజాగా సముద్రం వద్ద నిలబడిన ఫొటోను జడ్డూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దానికి 'సీ యూ సూన్' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇది చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 2019 వరల్డ్ కప్ తర్వాత జడ్డూ తనను తాను చాలా మార్చుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సరైన ఫినిషర్గా రాణిస్తూనే.. టెస్టుల్లో కీలకమైన బ్యాటర్గా మారాడు. ప్రపంచ నెంబర్ వన్ ఆల్రౌండర్గా తనను తాను మలుచుకున్నాడు. అలాంటి సమయంలో గాయాల కారణంగా జట్టుకు దూరం అవ్వాల్సి వచ్చింది.
అయితే శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో కూడా జడేజా లేడు. కాబట్టి ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయానికి అతను జట్టుతో చేరతాడని తెలుస్తోంది. ఈ సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు నాలుగు టెస్టు మ్యాచులు ఆడతాయి. వీటిలో రవీంద్ర జడేజా చాలా కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎంతైనా భారత్లో పిచ్లు స్పిన్కు సహకరిస్తాయి కదా. అలాంటప్పుడు జడేజా, అశ్విన్ జోడీ అటు బ్యాటుతో, ఇటు బంతితో జట్టుకు చాలా కీలకంగా మారతారు. మరి ఈ సిరీస్లో జడ్డూ ఆడటం గ్యారంటీనా? అని తెలియాలంటే ఆ జట్టును ప్రకటించే వరకూ వెయిట్ చేయక తప్పదు.