
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా ఆల్రౌండర్ల జాబితాలో నంబర్వన్ స్థానానికి దూసుకొచ్చాడు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ జేసన్ హోల్డర్ (384 రేటింగ్ పాయింట్లు), ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (377)లను వెనక్కు నెట్టిన జడేజా అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. జడేజా ఖాతాలో ప్రస్తుతం 386 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2017 ఆగస్ట్ తర్వాత ఆల్రౌండర్ల జాబితాలో జడేజా నంబర్వన్ స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ జాబితాలో టీమిండియా ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ 353 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
బ్యాటింగ్ విభాగంలో టాప్ 10 ప్లేయర్స్ జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని.. 814 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (747), స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (747) వరుసగా 6, 7 ర్యాంకుల్లో ఉన్నారు. బ్యాట్స్మన్ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (891) టాప్ ప్లేస్లో ఉన్నాడు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (886), ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబూషేన్ (878) 2, 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లీష్ టెస్ట్ సారథి జో రూట్ (797) ఐదులో కొనసాగుతున్నాడు.
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ మూడు స్థానాలు మెరుగుపరచుకుని 3వ ర్యాంక్లోకి దూసుకొచ్చాడు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ పేసర్ పాట్ కమిన్స్ (908) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 850 పాయింట్లతో రెండో ర్యాంకులో, ఆసీస్ పేసర్ జోష్ హేజిల్వుడ్ 816 పాయింట్లతో నాలుగో ర్యాంకులో ఉన్నారు. కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ (815) టాప్-5లో ఉన్నాడు. అశ్విన్ తప్ప మరే భారత బౌలర్ టాప్-10ల లేరు.
ఇక జట్ల విభాగంలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కివీస్ ఖాతాలో ప్రస్తుతం 123 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత్ (121), ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107)లు వరుసగా 2, 3, 4 ర్యాంక్ల్లో ఉన్నాయి. పాకిస్తాన్ (94), దక్షిణాఫ్రికా (88), వెస్టిండీస్ (78), శ్రీలంక (78), బంగ్లాదేశ్ (46), జింబాంబ్వే (35) వరుసగా ఉన్నాయి. జింబాంబ్వే టెస్ట్ మ్యాచ్ ఆడి చాలా రోజులైంది.