
దుబాయ్: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు ఆల్రౌండర్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానానికి చేరువగా వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో ఆల్రౌండర్ విభాగంలో జడేజా (377 పాయింట్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ (370)ను ఏడు పాయింట్లతో అధిగమించాడు. గత ఆదివారం ఇంగ్లండ్తో ముగిసిన తొలి టెస్టులో జడేజా తొలి ఇన్నింగ్స్లో అద్భుత అర్థ సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కీలక సమయంలో ఓపెనర్ కేఎల్ రాహుల్కు అండగా నిలిచాడు.
నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 86 బంతులాడి 56 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. చెత్త షాట్లకు పోకుండా అద్భుతంగా ఆడాడు. సింగల్స్ తీస్తూనే.. బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో ఆరో వికెట్కి కేఎల్ రాహుల్తో కలిసి విలువైన 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత్కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించిన జడేజా నెంబర్ వన్ స్థానానికి మరింత చేరువయ్యాడు. వెస్టిండీస్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ 384 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్తో మరో నాలుగు టెస్టులు మిగిలి ఉండడంతో జడేజా మంచి ప్రదర్శన కనబరిస్తే.. త్వరలోనే నెంబర్వన్ ర్యాంక్కు చేరుకునే అవకాశం ఉంది.
టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (901), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (891), ఆసీస్ స్టార్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ (878) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 846 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. 791 పాయింట్లతో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఐదో స్థానంకు పడిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కోహ్లీ ఒక ర్యాంకు దిగజారాడు. దాంతో రూట్ 4, కోహ్లీ 5 స్థానాల్లో ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషభ్ పంత్ వరుసగా 6, 7 స్థానాల్లో కొనసాగుతున్నారు. 84, 26 పరుగులతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ తిరిగి ర్యాంకింగ్స్లో ప్రవేశించాడు. 56వ స్థానంలో ఉన్నాడు.

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో పైకి దూసుకొచ్చాడు. తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో తిరిగి టాప్-10లో ప్రవేశించాడు. తొలి టెస్టులో 9/110తో అదరగొట్టడంతో పది స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 2019, సెప్టెంబర్లో బుమ్రా కెరీర్లో అత్యుత్తమంగా మూడో ర్యాంకులో ఉన్నాడు. కొన్నాళ్లు క్రికెట్కు దూరమైన అతడు ఈ మధ్య కాలంలో ఫామ్లో లేడు. బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. శార్దూల్ ఠాకూర్ 19 స్థానాలు ఎగబాకి 55కు చేరుకున్నాడు. ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఒక స్థానం మెరుగై 7కు చేరుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన షకీబ్ ఆల్ హసన్ ఆల్రౌండర్ విభాగంలో 286 పాయింట్లతో టాప్లో ఉన్నాడు. ఒక పాయింట్ తేడాతో మహ్మద్ నబీ (285) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో తబ్రెయిజ్ షంసీ 792 పాయింట్లతో తొలి స్థానం దక్కించుకున్నాడు. వహిందు హసరంగ 764 పాయింట్లతో రెండో స్థానం, 719 పాయింట్లతో రషీద్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 841 పాయింట్లతో డేవిడ్ మలాన్ తొలి స్థానంలో ఉండగా.. 819 పాయింట్లతో బాబర్ అజమ్ రెండో స్థానంలో ఉన్నాడు.