అహ్మదాబాద్: గిర్ అభయారణ్యంలో సింహాలతో ఫొటోలు చిక్కుపడ్డ రవీంద్ర జడేజాకు అటవీశాఖ అధికారులు రూ. 20వేల జరిమానా విధించారు. కాగా, రవీంద్ర జడేజా సింహాలతో ఫొటోలు దిగిన ఘటనపై ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(వైల్డ్ లైఫ్) జేఏ ఖాన్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే, విచారణ పూర్తి కాకముందే అటవీశాఖ అధికారులు తొందరపడి జరిమానాను విధించేయడం గమనార్హం. అంతేగాక, ఈ ఘటనపై జడేజా వ్యక్తిగత వాంగ్మూలాన్ని కూడా తీసుకోలేదు అధికారులు.
కాగా, జడేజా మామ హర్దేవ్ సింగ్ సోలంకి పవర్ అటార్నీ తీసుకుని ఆ జరిమానాను చెల్లించేశారు. రాష్ట్రంలో జడేజా లేనందున తాను పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నట్లు చెప్పారు.
జూన్ 14న సఫారీ దిగి సింహాలతో ఫొటోలు దిగిన వారిలో సోలంకి మాత్రం లేరు. జడేజా, అతని భార్య రీవా, స్నేహితులతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగారు. కాగా, అప్పుడు అక్కడ కొందరు అటవీశాఖ అధికారులు కూడా ఉండటం, చట్ట విరుద్ధంగా ఫొటోలు దిగుతున్న సమయంలో అధికారులు వారిని వారించకపోవడం గమనార్హం.
గుజరాత్ అటవీ శాఖ నిబంధనల ప్రకారం గిర్ అటవీ ప్రాంతంలో సఫారీకి వెళ్లే పర్యటకులు వాహనాల నుంచి కిందకు దిగకూడదు. కాగా, ఫొటోలు వైరల్ కావడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే, పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు అందకముందే జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.