Ravindra Jadeja: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ రిటెన్షన్ గడువు దగ్గర పడుతున్న తరుణంలో క్రికెట్ ప్రపంచంలో ఊహించని భారీ ట్రేడింగ్కు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగబోయే మార్పిడి ఒప్పందంపై క్రీడావర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. ఈ కీలక ఒప్పందంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు పంపనుంది. అందుకు బదులుగా సీఎస్కే నుంచి స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కరన్లను రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులోకి తీసుకోనుంది.
జడేజా కండీషన్: కెప్టెన్సీ ఇస్తేనే!
వివిధ క్రీడా నివేదికల ప్రకారం.. ఈ మూడు-మార్గాల ట్రేడింగ్ దాదాపుగా ఖరారైనట్లే. అయితే రాజస్థాన్ రాయల్స్కు తిరిగి వెళ్లేందుకు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒక కీలకమైన, అనూహ్యమైన షరతు పెట్టినట్లు సమాచారం. జడేజా స్పష్టం చేసిన దాని ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలను తనకు అప్పగిస్తేనే ఈ ట్రేడింగ్ ఒప్పందానికి అంగీకరిస్తానని వెల్లడించినట్లు సమాచారం. ఈ షరతుతో రాజస్థాన్ యాజమాన్యం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్కు సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్రేడింగ్కు కారణాలు
రాజస్థాన్ రాయల్స్కు దాదాపు దశాబ్ద కాలంగా సంజూ శాంసన్ ఓ కీలక ఆటగాడిగా, కెప్టెన్గా కొనసాగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు (4027) చేసిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత జట్టు మారాలని ఉందని సంజూ శాంసన్ యాజమాన్యానికి తెలియజేయడంతోనే వారు ఇతర ఫ్రాంచైజీలతో ట్రేడింగ్ అవకాశాలను పరిశీలించడం మొదలుపెట్టారు. ఐపీఎల్ 2025 వేలానికి ముందు సంజూ శాంసన్ను రాజస్థాన్ రూ. 18 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకుంది. ఇప్పుడు అదే మొత్తానికి అతన్ని చెన్నైకి ట్రేడ్ చేయనున్నారు.
జడేజా ప్రస్థానం: సీఎస్కేలో అనుభవం
రవీంద్ర జడేజా 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్లో అంతర్భాగంగా ఉంటూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. సీఎస్కే గెలిచిన ఐదు టైటిళ్లలో మూడు టైటిళ్లకు అతను ప్రధాన కారణంగా నిలిచాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తర్వాత రెండో ప్రాధాన్య ఆటగాడిగా జడేజాను కూడా సీఎస్కే రూ. 18 కోట్ల పారితోషికంతో రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు 254 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన జడేజా, 143 వికెట్లతో సీఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. 2022 సీజన్లో జడేజాకు సీఎస్కే కెప్టెన్సీ అప్పగించినా, జట్టు పేలవ ప్రదర్శన కారణంగా మధ్యలోనే అతన్ని తొలగించి మహేంద్ర సింగ్ ధోనీకి తిరిగి పగ్గాలు అప్పగించారు. ఈ అనుభవం ఉన్నా కూడా రవీంద్ర జడేజా ఇప్పుడు కెప్టెన్సీ షరతు పెట్టడం గమనార్హం.
జడేజాకు రాజస్థాన్తో ఉన్న బంధం
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రవీంద్ర జడేజా తన ఐపీఎల్ కెరీర్ను 2008లో రాజస్థాన్ రాయల్స్తోనే ప్రారంభించాడు. ఆ ఏడాది రాజస్థాన్ టైటిల్ గెలిచిన జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 18 సంవత్సరాల తర్వాత అదే జట్టుకు కెప్టెన్గా తిరిగి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డీల్ జరగడం వల్ల రాజస్థాన్ ఒక అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ను, అలాగే ఒక పేస్ ఆల్రౌండర్ (శామ్ కరన్) ను పొందనుంది. జడేజా షరతును రాజస్థాన్ యాజమాన్యం అంగీకరిస్తుందో లేదో చూడాలి.