హైదరాబాద్: కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్లు సాధించడంతో జడేజా 150వ టెస్టు వికెట్ల క్లబ్లో చేరాడు.
తద్వారా తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని అందుకున్న రెండో భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. భారత్ తరుపున తక్కువ టెస్టుల్లో 150 వికెట్లు బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 32 టెస్టుల్లో 60వ ఇన్నింగ్స్ ద్వారా జడేజా ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్ 29 టెస్టుల్లోనే 150 వికెట్లను సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ప్రసన్న, కుంబ్లే ఉమ్మడిగా మూడో స్థానంలో ఉండగా హర్భజన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో పాటు తక్కువ టెస్టుల్లో ఈ మార్కును చేరిన లెఫార్మ్ స్పిన్నర్లలో జడేజా తొలి స్థానంలో నిలిచాడు.
వినోద్ మన్కడ్, టీ లాక్, డెరిక్ అండర్ వుడ్, రంగనా హెరాత్లను రికార్డుని కూడా జడేజా అధిగమించాడు. వీరంతా 40 టెస్టుల్లో 150 వికెట్లు సాధించిన లెఫ్టార్మ్ స్పిన్నర్లు. ఇన్నింగ్స్ 34.5వ ఓవర్ వద్ద డిసెల్వాని ఔట్ చేయడంతో జడేజా తన టెస్టు కెరీర్లో 150 వికెట్లను పూర్తి చేశాడు. అంతకుముందు కెప్టెన్ దినేశ్ చండిమాల్ను జడేజా పెవిలియన్కు చేర్చాడు.
కోహ్లీ నాయకత్వంలో జడేజాకి ఇది 100వ వికెట్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇటీవల ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రవీంద్ర జడేజా రెండో స్ధానంలో నిలిచిన సంగతి తెలిసిందే.