ముంబై: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ర్యాంకులను ప్రకటించింది. టెస్ట్ మ్యాచ్లకు సంబంధించి బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ కేటగిరీలకు చెందిన ర్యాంకుల జాబితాను విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో తొలి 10 స్థానాల్లో భారత ఆటగాళ్లు ఇద్దరికి చోటు దక్కింది. అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియా ఎగరేసుకెళ్లింది. రెండో స్థానం కూడా ఆసీస్ బ్యాటర్లదే. భారత్తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన ప్లేయర్లు తొలి 10 స్థానాల్లో నిలిచారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ క్రికెట్ బ్యాటింగ్ విభాగం ర్యాంకింగ్లో మార్కస్ లంబుషెన్ అగ్రస్థానంలో నిలిచాడు. అతను సాధించిన పాయింట్లు 892. రెండో స్థానాన్ని స్టీవ్ స్మిత్ దక్కించుకున్నాడు. 845 పాయింట్లతో ఈ స్థానానికి ఎగబాకాడు. 844 పాయింట్లతో న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో ప్లేస్లో ఉన్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్, పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు. వారి పాయింట్లు 843, 815.
శ్రీలంక బ్యాటర్ కరుణరత్నె-781, ఉస్మాన్ ఖవాజా-757, టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ-754, ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రవిస్ హెడ్-744, భారత జట్టు మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ-742 పాయింట్లతో చివరి అయిదు స్థానాల్లో నిలిచారు. రిషభ్ పంత్ తన ర్యాంకును మెరుగుపర్చుకోగలిగాడు. 11వ స్థానానికి ఎగబాకాడు. ఓ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగుల్లో 11వ స్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఇదివరకు వికెట్ కీపర్ బ్యాటర్లు ఈ హయ్యెస్ట్ ర్యాంక్ను అందుకోలేదు.
కాగా- ఐసీసీ ప్రకటించిన టెస్ట్ క్రికెట్ ఆల్రౌండర్ కేటగిరీలో తొలి రెండు స్థానాలు భారత్కే లభించాయి. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. బ్యాటింగ్, బౌలింగ్లో నిలకడగా రాణిస్తుండటంతో అతను ఈ కేటగిరీలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. రెండో స్థానంలో సీనియర్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. వెస్టిండీస్, శ్రీలంక సిరీస్లో వారిద్దరూ రాణించారు. రవీంద్ర జడేజా-385, రవి అశ్విన్ 341 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. రవి అశ్విన్ బౌలింగ్ కేటగిరీలోనూ రెండో స్థానంలో ఉన్నాడు.