
ఎవరో ఒకరే అసలు విజేతగా నిలవాలి:
ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితి చూస్తుంటే.. డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ డే అయిన బుధవారం గరిష్ఠంగా 98 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవుతుంది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 64 పరుగులు చేసి.. 32 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆరో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ పూర్తికావాలి, కివీస్ మళ్లీ టార్గెట్ ఛేదించాలి. ఇది కష్టంగానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు జట్ల మధ్య ఎవరో ఒకరే అసలు విజేతగా నిలవాలని అందరూ కోరుకుంటారు.

టైమ్ పరిమితి లేని మ్యాచ్ ఆడాలి:
సాధారణంగా ఓ టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు జరుగుతుంది . ఇది ఫైనల్ కాబట్టి ఐసీసీ 'రిజర్వ్ డే'ను కేటాయించింది. అంటే ఇది ఆరు రోజుల మ్యాచ్. అయినా వర్షం వల్ల విజేత తేలే అవకాశం లేదు. అసలు విజేతను తేల్చడానికి టైమ్ పరిమితి లేని మ్యాచ్ ఆడాలని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. ఎవరో ఒకరు గెలిచే వరకూ మ్యాచ్ను కొనసాగించాలని యాష్ సూచించాడు. వాతావరణాన్ని ఎవరూ నియంత్రించలేరు కానీ.. ఈ మ్యాచ్కో బహుమతి ఉంది కదా. అందుకే మ్యాచ్ ముగిసే వరకూ ఆడుతూ ఉంటే బాగుంటుంది. కానీ అది సాధ్యమయ్యేలా లేదని అశ్విన్ అన్నాడు.

పరిమితి లేకుండా ఆడింది ఎప్పుడంటే:
క్రికెట్లో చివరిసారి పరిమితి లేకుండా ఆడింది 1939లో. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు డర్బన్లో తలపడిన సమయంలో మ్యాచ్ 9 రోజుల పాటు సాగింది. మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ మొత్తం 12 రోజులు గడిచిపోయాయి. మ్యాచ్లో ఫలితం కోసమే ఇలా మ్యాచ్ కొనసాగించారు. అయినా చివరికి మ్యాచ్ మాత్రం డ్రాగానే ముగిసింది. అందుకు కారణం లేకపోలేదు. ఇంగ్లండ్ తిరిగి ఇంటికి వెళ్లిపోవడానికి బోటు సిద్ధంగా ఉంది. అది మిస్ చేసుకోకూడదని భావించిన ఇంగ్లండ్.. చివరికి మ్యాచ్ను అక్కడే ముగించి వెళ్లిపోయింది.

పూర్తి ఆట సాధ్యమేనా:
మంగళవారంతో పోలిస్తే బుధవారం వాతావరణం మరింత మెరుగ్గా ఉంటుందని తెలిసింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నా చక్కగా వెలుతురు ఉండనుంది. వర్షం కురిసే అవకాశం లేకపోవడం శుభసూచకం. ఉదయం 10 గంటలకు 16 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు 20 డిగ్రీలకు చేరుకుంటుంది. అంటే ఈ రోజు పూర్తి ఆట సాధ్యమవుతుంది. చక్కగా ఎండకాస్తే మాత్రం భారత్కే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. చల్లని పరిస్థితులు ఉంటే మాత్రం కివీస్ ఆధిపత్యం చెలాయిస్తుంది.


Click it and Unblock the Notifications












