
అబుధాబి: సాధారణంగా క్రికెట్ ప్లేయర్స్నో లేక సెలెబ్రిటీలనో టార్గెట్గా చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బేస్ చేసుకుని ట్రోల్స్ చేస్తుంటారు నెటిజన్లు. మీడియా కూడా అంతే. తనకు ఆఫ్ ది రికార్డ్గా అందిన సమాచారం ఆధారంతో సెలెబ్రిటీస్ మీద కథనాలను అల్లుతుంటుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. టీమిండియా స్టార్ స్పిన్నర్, ఢిల్లీ కేపిటల్స్ బౌలింగ్ తురుఫుముక్క రవిచంద్రన్ అశ్విన్.. రివర్స్ స్వింగ్ సంధిస్తున్నాడు. మీడియాను ట్రోల్ చేశాడు. ఫేక్ న్యూస్ అంటూ కౌంటర్ అటాక్కూ దిగాడు.
టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ముగ్గురు సీనియర్ ప్లేయర్లు.. అతనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్కు కంప్లయింట్ ఇచ్చారంటూ ఒకట్రెండు రోజులుగా మీడియాలో వరుసగా కథనాలు వెలువడుతోన్నాయి. దీనికంతటికీ మూలకారకుడు రవి చంద్రన్ అశ్వినే అనేది మీడియాలో వస్తోన్న కథనాల సారాంశం. రవి అశ్విన్తో పాటు చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానె- ముగ్గురూ కలిసి విరాట్ కోహ్లీ కేప్టెన్సీని తప్పుపట్టారని, అతని ప్రవర్తన మీద అభ్యంతరం వ్యక్తం చేశారని, దీన్ని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా దృష్టికి తీసుకెళ్లారంటూ కథనాలు వచ్చాయి.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో ఓటమిపాలైన తరువాత.. ఈ ముగ్గురూ కోహ్లీ కేప్టెన్సీపై అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేశారంటూ వార్తలొచ్చాయి. కోహ్లీ సమర్థవంతంగా జట్టును నడిపించకపోవడం, గందరగోళ నిర్ణయాలను తీసుకోవడం, ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును కట్టి పడేయడానికి సమర్థవంతంగా వ్యూహాలను రూపొందించలేకపోవడం వల్లే ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడి పోవాల్సి వచ్చిందంటూ ఓ టాప్ న్యూస్ ఏజెన్సీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

విశ్వసించదగ్గ న్యూస్ ఏజెన్సీ కావడం వల్ల దాన్ని అన్ని స్పోర్ట్స్ న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేశాయి. ఈ మీడియాలో వెలువడిన ఈ కథనాల పట్ల రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపడేశాడు. మరో క్రికెటర్ లేదా సెలెబ్రిటీ అయి ఉంటే ఓ రిజాయిండర్ ఇచ్చేవాళ్లు. అక్కడున్నది రవిచంద్రన్ అశ్విన్. అందుకే- తనదైన స్టైల్లో కౌంటర్ అటాక్కు దిగాడు. ఆ న్యూస్ ఏజెన్సీని ట్రోల్ చేశాడు. ఈ మేరకు తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ను షేర్ చేశాడు.