IND vs ENG: ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధిస్తుందని అంచనాలు వేసినప్పటికీ టీమిండియా ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది. లండన్లోని ఓవల్ మైదానంలో 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ జట్టు తమ చివరి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఈ మైదానంలో గతంలో చివరి ఇన్నింగ్స్లో విజయవంతంగా ఛేదించిన అత్యధిక స్కోరు కేవలం 265 పరుగులు మాత్రమే. దీంతో భారత జట్టు విజయం ఖాయమని అభిమానులు ఆశించారు. కానీ హ్యారీ బ్రూక్, జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి, 195 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి పరిస్థితిని పూర్తిగా మార్చేశారు.
టీమిండియా వెనుకబడటానికి కారణం ఇదే..: అశ్విన్
హ్యారీ బ్రూక్, జో రూట్ ఇద్దరూ సెంచరీలు సాధించడం భారత జట్టుకు భారీ నష్టాన్ని కలిగించింది. దీనిపై స్పందించిన భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. జో రూట్ క్రీజులో ఉన్నప్పుడు భారత జట్టు స్పిన్ బౌలింగ్ను సరిగా ఉపయోగించకపోవడమే ఈ ఎదురుదెబ్బకు ప్రధాన కారణమని ఆరోపించారు. భారత ఆటగాళ్లకు మ్యాచ్ గురించి అవగాహన సరిపోవడం లేదని అన్నారు. ఈ సిరీస్ స్పిన్నర్లను ఎక్కువగా ఉపయోగించలేదని.. దీని వల్లే మనం ఈ సిరీస్లో వెనుకబడి ఉన్నామన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ ముందంజలో ఉందని స్పష్టం చేశారు.

మైదానంలో మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలని.. యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ భవిష్యత్తులో గొప్ప కెప్టెన్గా ఎదుగుతాడన్నారు. తప్పుల నుంచి నేర్చుకుంటాడని ఆశిస్తున్నానని.. ఐదో టెస్ట్లో ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్నర్లను ఖచ్చితంగా ఉపయోగించి ఉండాలని సూచించారు. ఆ అవకాశాన్ని భారత్ కోల్పోయిందని తాను భావిస్తున్నానని తమ వ్యూహాత్మక లోపాన్ని ఎత్తి చూపారు.
వాషింగ్టన్ సుందర్ను ముందే రంగంలోకి దించి ఉండాలి: అశ్విన్ సలహా
అశ్విన్ తన విమర్శలను కొనసాగిస్తూ.. "మీరు స్పిన్నర్ను ఉపయోగించకపోతే, వారు కేవలం డిఫెన్స్ కోసం మాత్రమే ఉంటారు, వికెట్లు తీసే అవకాశం వారికి లభించదు. హ్యారీ బ్రూక్ 20 పరుగులు దాటిన తర్వాత ఒక ఎండ్లో స్పిన్నర్ను, మరొక ఎండ్లో పేస్ బౌలర్ను ఉపయోగించి పరుగులు కట్టడి చేసి ఉండాలి. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ను చాలా త్వరగా బౌలింగ్ చేయడానికి పిలిచి ఉండాలి. ఈ తప్పులన్నీ చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి" అని జట్టు వ్యూహాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
"ఈ సలహాలన్నీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి కెప్టెన్కు అందిస్తున్నారా లేదా నాకు తెలియదు. కానీ ఇలాంటి తప్పులన్నీ సరిచేసి ఉండాలి" అని అశ్విన్ పేర్కొన్నారు. భారత బౌలర్లు వేసిన మొత్తం 76.2 ఓవర్లలో, స్పిన్నర్లు కేవలం 8 ఓవర్లు మాత్రమే వేశారని గమనించడం ముఖ్యం. అంతేకాదు, మొదటి ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ ఒక్క ఓవర్ కూడా వేయలేదు, జడేజా కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఈ గణాంకాలు స్పిన్నర్లను తక్కువగా ఉపయోగించారన్న అశ్విన్ వాదనకు బలం చేకూరుస్తాయి.