రుతురాజ్పై బూతుల వర్షం.. సీఎస్కే ఫ్యాన్స్పై అశ్విన్ ఫైర్!
ఐపీఎల్ 2026 సీజన్లో వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి సీఎస్కే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. టోర్నీ ఆరంభంలో అద్భుత విజయాలతో టాప్-4 రేసులో బలంగా కనిపించిన సీఎస్కే.. లీగ్ ముగింపు దశలో వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో ఘోర పరాజయాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొందరు ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు, అసభ్యకరమైన ట్రోలింగ్స్, బూతులతో విరుచుకుపడుతున్నారు.
రుతురాజ్ గైక్వాడ్ పేలవ ఫామ్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఈ ఐపీఎల్ సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శన కెప్టెన్గా, బ్యాటర్గా ఆశించిన స్థాయిలో లేదు. రుతురాజ్ గైక్వాడ్ కేవలం పరుగులు చేయడంలోనే కాకుండా కనీసం మంచి స్ట్రైక్ రేట్తో ఆడటంలోనూ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సీజన్ మొత్తంలో రుతురాజ్ గైక్వాడ్ 123.44 నిరాశాజనకమైన స్ట్రైక్ రేట్, 28.08 సగటుతో కేవలం 337 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సీఎస్కే ఓటమికి రుతురాజ్ గైక్వాడ్ పేలవమైన బ్యాటింగే ప్రధాన కారణమంటూ కొందరు అభిమానులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అయితే రుతురాజ్ గైక్వాడ్పై జరుగుతున్న ఈ హేయమైన ట్రోలింగ్ను చూసి భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రుతురాజ్కు మద్దతుగా నిలుస్తూ ఫ్యాన్స్కు గట్టి క్లాస్ పీకాడు.

ఆటగాళ్లను బూతులు తిట్టడం సరికాదు: అశ్విన్ వార్నింగ్
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన వీడియోలో రుతురాజ్ గైక్వాడ్ను సమర్థిస్తూ మాట్లాడారు. "నేను ఎప్పుడూ చెబుతుంటాను, రుతురాజ్ చాలా మంచి ఆటగాడు. కొందరు వ్యక్తులు అతన్ని ఎందుకు అంత దారుణంగా తిడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. రుతురాజ్ లాంటి ఆటగాడికి ఇలాంటి విమర్శలు తగవు. కెరీర్లో ఎవరికైనా ఎప్పుడైనా గడ్డు కాలం రావచ్చు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదాహరణకు ఇషాన్ కిషన్ను చూడండి.. ముంబై ఇండియన్స్ అతని కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టింది, కానీ అతను అక్కడ రాణించలేకపోయాడు. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా అతనిపై ఇన్వెస్ట్ చేసింది, ప్రస్తుతం అతను ఎస్ఆర్హెచ్ తరఫున అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి సమయం అందరికీ మారుతుంది. అంతమాత్రానికే ఒక ఆటగాడిని వ్యక్తిగతంగా దూషించడం, ట్రోల్ చేయడం ఎంతమాత్రం సరికాదు" అని అశ్విన్ మండిపడ్డాడు.
ధోనీ యుగం నుంచి బయటపడండి..
గతంలో సీఎస్కే జట్టుకు స్పిన్నర్గా పనిచేసిన అశ్విన్.. సీఎస్కే ఫ్యాన్స్కు ఓ కీలక విజ్ఞప్తి చేశాడు. ధోనీ కెప్టెన్సీలో ఉన్నప్పుడు జట్టుపై ఎలాంటి అంచనాలు పెట్టుకునేవారో.. ఇప్పుడు కూడా అలాంటివే ఆశించడం మానుకోవాలని సూచించాడు. "ఈసారి చెన్నై అత్యుత్తమ ప్రదర్శన చేయలేదనే విషయాన్ని అందరూ గ్రహించాలి. ఇప్పుడు రోజులు మారాయి. గత 18 ఏళ్లుగా ధోనీ, సీఎస్కే కలిసి ప్రతిసారీ గెలవడం, ప్లేఆఫ్స్ చేరడం వంటి అలవాట్లను ఫ్యాన్స్కు నేర్పించారు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో 10 జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఏ జట్టునైనా ఎవరైనా ఓడించగలరు. ఈసారి పాయింట్ల పట్టికలో తనకంటే కింద ఉన్న జట్లపై మాత్రమే సీఎస్కే గెలిచింది. కాబట్టి వారు భవిష్యత్తులో మరింత కష్టపడాలి. అయితే, ఈ జట్టులో మంచి సత్తా ఉంది" అని రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications