
హైదరాబాద్: 2018-19లో ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం జరిగిన ఓ సంఘటన ద్వారా తనను బస్సు కింద తోసిసినట్లు అనిపించిదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. ఆస్ట్రేలియా వేదికగా భారత్, ఆసీస్ మధ్య జరిగిన ఆ టెస్ట్ సిరీస్ను టీమిండియా 2-1తో గెలుచుకోని చరిత్ర సృష్టించింది. దీంతో అప్పటి టీమిండియాపై మాజీలతోపాటు అభిమానులు కూడా ప్రశంసలు కురిపించారు. ఆ విజయం సందర్భంగా అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ విదేశాల్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నంబర్ వన్ 1 బౌలర్ అని కొనియాడాడు. అయితే ఆ వ్యాఖ్యలను తాను తట్టుకోలేకపోయానని రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. రవిశాస్తి వ్యాఖ్యలు తనను బాగా బాధించాయని చెప్పుకొచ్చాడు. అప్పుడు తాను బస్సు కింద పడినట్లు భావించానని చెప్పుకొచ్చాడు. కాగా అప్పుడు సిరీస్ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరిగింది. ఆ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు దీంతో కుల్దీప్ యాదవ్ను హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలతో ముంచెత్తాడు.
తాజాగా ఆ సంఘటన గురించి ఓ క్రీడా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు. రవిశాస్త్రి అంటే తనకు అమితమైన గౌరవమని తెలిపాడు. మనలో ప్రతి ఒక్కరు కొన్నిసార్లు ఏదో ఒకటి మాట్లాడి మళ్లీ వెనక్కి తీసుకుంటారని, కానీ రవిశాస్త్రి వ్యాఖ్యలతో తాను బాధతో చాలా కుంగిపోయానని చెప్పాడు. నిజానికి సిడ్నీలో జరిగిన ఆ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ ప్రదర్శన పట్ల తాను చాలా సంతోషించానని చెప్పాడు. 5 వికెట్లు తనకు దక్కపోయినా కుల్దీప్కు దక్కినందకు ఆనందం కల్గించిదని చెప్పాడు. ఆస్ట్రేలియాలో స్పిన్నర్లు 5 వికెట్లు తీయడం ఎంత కష్టమో తనకు తెలుసని, తాను ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ 5 వికెట్లు తీయలేకపోయానని చెప్పాడు. అందుకే కుల్దీప్ యాదవ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషం వ్యక్తం చేసినట్టు అశ్విన్ తెలిపాడు.
సిడ్నీ టెస్ట్ డ్రా కావడంతో ఆ సిరీస్ను టీమిండియా 2-1తో గెలుచుకుంది. అయితే ఆ విజయం అనంతరం నిర్వహించిన పార్టీలో పాల్గొనడానికి తనకు మనసు ఒప్పలేదని అశ్విన్ తెలిపాడు. ఎందుకంటే రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలతో ఆ విజయంలో తన పాత్ర లేదని బాధపడ్డానని చెప్పాడు. సంబురాల్లో పాల్గొనాలంటే ఆ విజయంలో తన పాత్ర ఉండాలనుకుంటానని, కానీ అలా కాకుండా తనను బస్సు కింద పడేసినట్లు చేస్తే ఎలా పార్టీలో పాల్గొనని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే అక్కడి నుంచి తన రూమ్కు వెళ్లిపోయి తన భార్య, కూతురితో మాట్లాడానని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ మనసు మార్చుకుని వచ్చి పార్టీలో పాల్గొన్నట్టు అశ్విన్ వివరించాడు.