మైదానంలో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ప్రశాంతతో ఉంటాడు. తీవ్ర ఒత్తిడి ఉన్న కామ్గా ఉంటూ జట్టును ముందుకు నడిపిస్తాడు. ఆటగాళ్లు తప్పులు చేసినా కోపాన్ని ప్రదర్శించడు. కానీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే మాత్రం ధోనీ కన్నెర్ర చేస్తాడని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. జట్టు బాధ్యతలను వదిలేసి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తే బెంచ్ ప్లేయర్ను కూడా వదలడని పేర్కొన్నాడు.
తన ఆత్మకథ 'ఐ హ్యావ్ ద స్ట్రీట్స్ - ఎ కుట్టి క్రికెట్ స్టోరీ'లో లో అశ్విన్ ఈ ఆసక్తికర విషయాలు ప్రస్తావించాడు. 2010లో దక్షిణాఫ్రికా పర్యటన గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు. 2010 దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో తుదిజట్టులో శ్రీశాంత్కు చోటు దక్కలేదు. అయితే శ్రీశాంత్ డగౌట్కు రాకుండా, డ్రింక్స్ అందించకుండా ఉండటంతో అతనిపై ధోనీ సీరియస్ అయ్యాడని అశ్విన్ చెప్పాడు.

''ఆ మ్యాచ్లో నేను వాటర్ తీసుకెళ్లా. ధోనీ తాగాడు. కాసేపటికీ మళ్లీ వెళ్లాను. అందరికంటే ధోనీకే ఎక్కువగా డ్రింక్స్ తీసుకెళ్లా. అయితే డ్రింక్స్ బ్రేక్లో మరోసారి వెళ్లినప్పుడు.. శ్రీశాంత్ ఎక్కడ ఉన్నాడని ధోనీ అడిగాడు. ధోనీ అలా ఎందుకు అడిగాడో మీకు తెలియకపోవచ్చు. కానీ నేను చెబితే అది ఎక్కడకు దారితీస్తుందో అని చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించా''
''కానీ ధోనీ పట్టుబట్టాడు. శ్రీశాంత్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలనుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడని చెప్పా. మిగిలిన రిజర్వ్ ప్లేయర్లలానే శ్రీశాంత్కు డగౌట్లో కూర్చొమని ధోనీ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో వికెట్ కీపింగ్ బాధ్యతలు చేస్తూ ధోనీ ఈ విషయాన్ని ఎలా గమనించాడని ఆశ్చర్యపోయా. అయితే ఆ తర్వాత ధోనీ రమ్మంటున్నాడని శ్రీశాంత్కు చెప్పాను. సరే, నేను వస్తాను అని బదులిచ్చాడు''

''కాసేపటికీ హెల్మెట్ ఇవ్వడం కోసం ధోనీ దగ్గరకు వెళ్లా. ధోనీ చాలా కోపంతో ఉన్నాడు. 'శ్రీ ఎక్కడ? ఏం చేస్తున్నాడు' అని సీరియస్గా అడిగాడు. శ్రీశాంత్ మసాజ్ చేయించుకుంటున్నాడని చెప్పా. తర్వాతి ఓవర్లో హెల్మెట్ రిటర్న్ ఇవ్వడానికి ధోనీ నన్ను పిలిచాడు. హెల్మెట్ ఇస్తూ 'ఓ పని చెయ్యి. రంజీబ్ సర్ దగ్గరికి వెళ్లి.. శ్రీశాంత్కు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. భారత్కు తిరిగి వెళ్లడానికి రేపు టికెట్ బుక్ చెయ్యమని చెప్పు' అని అన్నాడు''
''నేను షాక్ అయ్యాను. ఏం చెప్పాలో తెలియక ధోనీ ముఖం వైపు చూస్తున్నాను. 'ఏమైంది? ఇంగ్లిష్ కూడా నీకు అర్థం కాదా?' అని ధోనీ అన్నాడు. ఆ తర్వాత శ్రీశాంత్ కిందికి వచ్చి డ్రింక్స్ బాధ్యతలు చూసుకున్నాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని వారిద్దరు మాట్లాడుకున్నారు'' అని అశ్విన్ చెప్పాడు.