హైదరాబాద్: ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీ సేన వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా ప్రధాన స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన రెండో భారత స్ఫిన్నర్గా గుర్తింపు పొందాడు. అంతకముందు భారత్ తరుపున ఇటీవలే కోచ్ పదవికి రాజీనామా చేసిన అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు.
ఈ అరుదైన ఘనత సాధించడానికి కుంబ్లేకి 106 మ్యాచ్లు అవసరం కాగా, రవిచంద్రన్ అశ్విన్కు 111 వన్డేలు అవసరమయ్యాయి. మూడో వన్డేకు ముందు అశ్విన్ 147 వికెట్లతో ఉన్నాడు. శుక్రవారం వెస్టిండిస్తో జరిగిన మూడో వన్డేలో జాసన్ హోల్డర్, అస్లే నర్స్, కమిన్స్ వికెట్లు తీసి ఈ అరుదైన ఘనత సాధించాడు.

మూడో వన్డేలో అశ్విన్ 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఐదు వన్డేల సిరిస్లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లో టీమిండియా వరుసగా విజయాలను సాధించింది. దీంతో వెస్టిండిస్పై 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
కాగా, శుక్రవారం జరిగిన మూడో వన్డేలో వెస్టిండిస్పై టీమిండియా 93 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు. ఏ ఒక్క బ్యాట్స్మన్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోవడంతో విండీస్ 38.1 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది.
విండీస్ ఆటగాళ్లలో మొహమ్మద్ (40) పరుగులతో టాస్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత పావెల్(30), షాయ్ హోప్(23), హోప్(19)లు మినహా ఎవరూ రెండెంకల పరుగులు చేయలేదు. భారత స్పిన్నర్లు అశ్విన్(3/28), కుల్దీప్ యాదవ్(3/41)లు అద్భుత ప్రదర్శన చేశారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది.