ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఘోరంగా ఓడింది. ఏకంగా 209 పరుగుల తేడాతో చిత్తయింది. ఈ ఓటమితో టీమిండియా మేనేజ్మెంట్, కెప్టెన్సీ, వ్యూహాలు అన్నింటిపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అశ్విన్ వంటి నెంబర్ వన్ బౌలర్ను జట్టులోకి తీసుకోకపోవడంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో అశ్విన్ ఒక ట్వీట్ చేశాడు.
డబ్ల్యూటీసీ గెలిచిన ఆసీస్కు కంగ్రాట్స్ చెప్పిన అతను.. ఓడిపోయినందుకు బాధ పడ్డాడు. అదే సమయంలో ఫైనల్ చేరడానికి రెండేళ్ల పాటు చాలా కష్టపడ్డామన్నాడు. అలాగే ఇన్ని విమర్శల మధ్య కూడా ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఆడిన తన టీంమేట్స్ను అలాగే తమకు ఎంతో మద్దతు ఇచ్చిన కోచింగ్, సపోర్ట్ స్టాఫ్ను మెచ్చుకోవాలని అన్నాడు.

భారత జట్టు ఈ ఫైనల్ చేరడంలో అశ్విన్ పాత్ర చాలానే ఉంది. కానీ అతన్ని ఫైనల్ ఆడించకపోవడంపై చాలానే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తను ట్వీట్ చేయడానికి కారణాన్ని అశ్విన్ వెల్లడించాడు. 'ఫైనల్ ముగిసిన తర్వాత నేను ఆ ట్వీట్ పెట్టా. ఎందుకంటే నాకు ఒక క్లోజర్ కావాలని అనిపించింది. అది లభిస్తే నేను భవిష్యత్తుపై ఫోకస్ పెట్టగలుగుతా. ఇప్పుడు నేను జీవితాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతున్నా' అని అశ్విన్ చెప్పాడు.
అంతేకాదు, క్రికెట్ ఆడటం వల్ల తన కుటుంబంపై చాలా మానసిక ఒత్తిడి పడుతుందని కూడా అశ్విన్ చెప్పాడు. ముఖ్యంగా హార్ట్ పేషెంట్ అయిన తన తండ్రి చాలా ఒత్తిడికి గురవుతాడని తెలిపాడు. తను ఆడతాను కాబట్టి, మ్యాచ్పై కొంత ప్రభావం చూపగలుగుతానని చెప్పిన అతను.. 'హార్ట్ పేషెంట్ అయిన మా నాన్నకు ఆ అవకాశం కూడా ఉండదు' అని అన్నాడు.
'నా కుటుంబంపై ఈ గేమ్ చూపించే ప్రభావం చాలా ఎక్కువ. మా నాన్నకు గుండె సమస్యతోపాటు మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను ఆడే ప్రతి మ్యాచ్, ప్రతి రోజూ ఏం జరిగినా.. ఆయన నాకు కాల్ చేస్తారు. ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నాడో నాకు అర్థం అవుతుంది. నేను ఆడటం నా కంట్రోల్లో ఉంటుంది కాబట్టి నేను అంత టెన్షన్ పడను. కానీ మా నాన్న మాత్రం నేను ఏం చేస్తానో అని టెన్షన్ పడుతూనే ఉంటారు' అని పేర్కొన్నాడు.