
చెన్నై: క్రికెట్లో బంతికి ఉమ్మి రాయడం క్రికెటర్లకు అలవాటుగా ఉందని, ఉమ్మి రాయకుండా ఉండాలన్నా కాస్త ప్రాక్టీస్ చేయాల్సిందేనని భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కరోనా వైరస్ కారణంగా బంతిపై ఆటగాళ్లు ఉమ్ము లేదా చెమటని ఇకపై రుద్దకూడదని ఐసీసీ ఓ నిబంధనని ప్రతిపాదించింది. టెస్టు ఫార్మాట్లో ఎరుపు బంతి మెరుపుని కాపాడుకునేందుకు బౌలర్లు, ఫీల్డర్లు దానిపై ఉమ్మి వేసి రుద్దేవారు. కానీ ఇకపై అలా ఉమ్మి రుద్దితే కరోనా వైరస్ వచ్చే ప్రమాదం ఉందని ఐసీసీ హెచ్చరిస్తోంది.
ఐపీఎల్లో తన ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో రవిచంద్రన్ అశ్విన్ బుధవారం పలు అంశాలపై మాట్లాడాడు. 'మళ్లీ క్రికెట్ ఆడేందుకు ఎప్పుడు బరిలోకి దిగుతామో నాకు తెలియదు. బంతికి ఉమ్మి రాయడం నాకు అలవాటైంది. అలా చేయకుండా ఉండాలంటే.. ముందు కొంత ప్రాక్టీస్ అవసరం. అయితే ఉమ్మి రాయకుండా బౌలింగ్ చేయడాన్ని అందరూ అలవాటు చేసుకోవాలి' అని అశ్విన్ అన్నాడు.
కరోనా వైరస్ ప్రభావం కారణంగా బంతికి ఉమ్మి రాయడాన్ని నిషేధించాలని భారత దిగ్గజం అనిల్ కుంబ్లే నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ ఐసీసీకి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా తర్వాత క్రికెట్ ప్రారంభమైనా.. బంతి నుంచి స్వింగ్ రాబట్టేందుకు ఆటగాళ్లు ఉమ్మి రాయడం కనిపించకపోవచ్చు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా కృత్తిమ ప్రదార్థాన్ని తీసుకురావాలని ఐసీసీకి కొందరు మాజీలు సూచిస్తున్నారు.
కెరీర్ ఆరంభంలో మాజీ క్రికెటర్ డబ్యూవీ రామన్ చేసిన సూచనలే తన బౌలింగ్ మెరుగుదలకు, కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేశాయని అశ్విన్ ఇటీవలే తెలిపాడు. ఇప్పటివరకూ 71 టెస్టులు ఆడిన అశ్విన్.. 365 వికెట్లు తీసాడు. ఒక టెస్టు మ్యాచ్లో పది వికెట్లను ఏడు సార్లు సాధిస్తే.. ఐదేసి వికెట్లను 27 సార్లు తీశాడు. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్గా గత ఏడాది విఫలమైన అశ్విన్.. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మారిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడింది.