భారత్ టెస్టు సమరానికి సిద్ధమైంది. దాదాపు నెలన్నర రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో అడుగుపెడుతోంది. స్వదేశంలో గురువారం నుంచి బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. బంగ్లాను చిత్తుగా ఓడించి వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ బెర్తు అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని పట్టుదలతో సన్నద్ధమవుతోంది.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టేబుల్లో భారత్ (74 పాయింట్లు, 68.52 %), ఆస్ట్రేలియా (90 పాయింట్లు, 62.50 %), న్యూజిలాండ్ (36 పాయింట్లు, 50 %), బంగ్లాదేశ్ (33 పాయింట్లు, 45.33 %) టాప్-4లో ఉన్నాయి. కాగా, బంగ్లాదేశ్ సిరీస్లో అరుదైన రికార్డుపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కన్నేశాడు.

మరో 14 వికెట్లు సాధిస్తే వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. లైయన్ 43 టెస్టుల్లో 187 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో ఉన్న కమిన్స్ 42 టెస్టుల్లో 175 వికెట్లు తీశాడు. ఇక మూడో స్థానంలో ఉన్న అశ్విన్ 35 టెస్టుల్లోనే 174 వికెట్లు పడగొట్టాడు.
స్పిన్కు అనుకూలించే భారత్ పిచ్లపై ఈ రికార్డును అశ్విన్ సునాయాసంగా అందుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అశ్విన్ మరో 26 వికెట్లు సాధిస్తే వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా నిలుస్తాడు. ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన అశ్విన్ 516 వికెట్లు పడగొట్టాడు. కాగా, సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్లో తొలి మ్యాచ్కు చెన్నై వేదిక కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా చివరి టెస్టు జరగనుంది.
బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.