న్యూజిలాండ్ జట్టుతో రాయ్పూర్లో జరిగిన రెండో టీ20లో భారత అద్భుత విజయం సాధించినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం బౌలర్లకు శాపంగా మారిందని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అశ్విన్.. మ్యాచ్ల సమయాలను మార్చాల్సిన అవసరం ఉందని సూచించారు. రెండో టీ20లో భారత్ విజయాన్ని అభినందిస్తూనే.. బౌలర్లకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రెండో ఇన్నింగ్స్లో మంచు కురవడం వల్ల బంతిని గ్రిప్ చేయడం బౌలర్లకు అసాధ్యంగా మారుతోందని రవిచంద్రన్ అశ్విన అన్నారు. "ఓ బౌలర్ వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమై.. మూడో మ్యాచ్లో ఇటువంటి మంచు పరిస్థితుల్లో బౌలింగ్ చేసి పరుగులు ఇస్తే.. అతని కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఇది బౌలర్ల పట్ల అన్యాయం" అని అశ్విన్ పేర్కొన్నారు.

మంచు ప్రభావం నుంచి ఆటను కాపాడుకోవడానికి రవిచంద్రన్ అశ్విన్ కొన్ని కీలక సూచనలు చేశారు. మంచు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మ్యాచ్లను మధ్యాహ్నం పూట నిర్వహించడం ఉత్తమమని సూచించారు. మంచు ప్రభావం తక్కువగా ఉండే మైదానాలను ఎంచుకోవాలని చెప్పారు. మంచు వల్ల బౌలర్ల నైపుణ్యానికి ప్రాధాన్యత తగ్గిపోతుందని, కేవలం టాస్ గెలిచిన జట్టుకే అడ్వాంటేజ్ ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ ఆతిథ్యమివ్వనున్న టీ20 వరల్డ్ కప్ 2026 గురించి అశ్విన్ హెచ్చరించారు. "వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ ఫలితాలను 'మంచు' శాసించకూడదు. అక్కడ ఆటగాళ్ల నైపుణ్యానికే ప్రాధాన్యత ఉండాలి కానీ, వాతావరణ పరిస్థితులకు కాదు. ఐసీసీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి" అని కోరారు. ఈ కష్ట పరిస్థితుల్లో కూడా 2 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ ప్రదర్శనను, అలాగే ఇషాన్ కిషన్ (76), సూర్యకుమార్ యాదవ్ (82*) విధ్వంసకర బ్యాటింగ్ను అశ్విన్ కొనియాడారు.