ఐపీఎల్ 2026లో వరుసగా రెండు భారీ పరాజయాలను చవిచూసిన కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టుపై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ బౌలర్లను అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఊచకోత కోయడంతో ఆ జట్టు 226 పరుగుల భారీ స్కోరు సమర్పించుకుంది. అనంతరం లక్ష్య ఛేదనలో కేకేఆర్ 161 పరుగులతే కుప్పకూలి 65 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
కేకేఆర్ బౌలర్లకు 'డెడ్ వార్నింగ్'.
ఈ మ్యాచ్పై తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించిన రవిచంద్రన్ అశ్విన్.. కేకేఆర్ బౌలింగ్ లైనప్లోని డొల్లతనాన్ని ఎత్తిచూపాడు. "ఈ సీజన్లో కోల్కతా జట్టు చాలా సమస్యలను ఎదుర్కోబోతోంది. బ్యాటింగ్, బౌలింగ్ పక్కన పెడితే.. కనీసం 4 ఓవర్లు నమ్మకంగా వేయగల ఒక్క బౌలర్ కూడా ఆ జట్టులో కనిపించడం లేదు. సాధారణంగా ప్రతి జట్టులో ఒకటి లేదా రెండు బలహీనమైన లింకులు ఉంటాయి. మిగిలిన వారు వారికి అండగా ఉంటారు. కానీ కేకేఆర్లో మాత్రం గ్యారెంటీగా 4 ఓవర్లు వేస్తాడమే నమ్మకం ఏ ఒక్క బౌలర్ పైనా కలగడం లేదు" అని రవిచంద్రన్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

వరుణ్ చక్రవర్తి ఫామ్పై ఆందోళన
ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ కేకేఆర్కు పెద్ద తలనొప్పిగా మారిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి కేవలం రెండు ఓవర్లలోనే 31 పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ ప్రస్తుతం మానసిక, సాంకేతిక పరమైన ఒత్తిడిలో ఉన్నాడని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు.
"వరుణ్ చక్రవర్తి మునుపెన్నడూ చూడని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తిలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా కనిపిస్తోంది. బౌలర్లు తనను సులభంగా ఎదుర్కొంటున్నప్పుడు కొత్త పద్ధతులను అన్వేషించాల్సిన అవసరం ఉంది. వరుణ్ నెట్స్లో తన హ్యాండ్ స్పీడ్ను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం స్పాట్ బౌలింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ పరిస్థితి ఏ బౌలర్కైనా వస్తుంది, కానీ సమాధానం వెతికి ముందుకు సాగడమే ముఖ్యం" అని రవిచంద్రన్ అశ్విన్ సూచించాడు.
వరుస పరాజయాలతో సతమతమవుతున్నకోల్కతా నైట్ రైడర్స్.. రవిచంద్రన్ అశ్విన్ చెప్పినట్లుగా తమ బౌలింగ్ విభాగంలో మార్పులు చేసుకుని తిరిగి పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి. గతేడాది మెరుపులు మెరిపించిన కేకేఆర్ స్పిన్నర్లు ఈ సీజన్లో తేలిపోతుండటం ఆ జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. తర్వాతి మ్యాచ్ కల్లా కేకేఆర్ ఈ లోపాలను సరిదిద్దుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.