
చెన్నై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ కోసం జనమంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్న వేళ.. మొట్ట మొదటి కరోనా వ్యాక్సిన్ను రష్యా విడుదల చేసింది. తన కుమార్తె సహా పలువురు టీకా వేయించుకున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్కు స్పుత్నిక్-వి అని నామకరణం చేశారు. అయితే రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్పై టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
'ప్రపంచంలోనే మొట్ట మొదటి కరోనా టీకా వచ్చేసింది. వ్యాక్సిన్ ప్రయోగం కూడా అయిపోయింది. చేతులు దాటింది. ఇది బాగా పనిచేస్తే అందరూ దీన్నే అనుసరిస్తారు. వెల్డన్.. #రష్యా వ్యాక్సిన్' అని రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలైనప్పుడు అశ్విన్ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉన్నాడు. కరోనా నిబంధనలు పాటించని వారిపై విరుచుకుపడ్డాడు. మార్చి 2020 ప్రారంభంలో న్యూజిలాండ్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అశ్విన్ చివరిసారిగా కనిపించాడు. భారత్ తరపున అశ్విన్ 71 టెస్టులు, 111 వన్డేలు, 46 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.
బంతిని వైవిధ్యంగా తిప్పడంలో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ది ప్రత్యేక శైలి. మ్యాచ్లు లేని సమయాల్లో కూడా గల్లీ క్రికెట్ ఆడుతూ.. బంతిని వివిధ రకాల్లో స్పిన్ చేయడానికి యత్నిస్తూ ఉంటాడు. 2015, 2016, 2017లలో వరుసగా మూడేళ్ల పాటు అశ్విన్ 50కు పైగా టెస్టు వికెట్లు సాధించాడు. కెరీర్ 54వ టెస్టులోనే 300 వికెట్లను మార్కును అందుకున్న ఘనత అశ్విన్ ఖాతాలో ఉంది. ఇటీవల కాలంలో తనకు అవకాశాలు తగ్గినా.. వచ్చిన అవకాశాలతో మళ్లీ గాడిలో పడటానికి రవిచంద్రన్ అశ్విన్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకూ 71 టెస్టులు ఆడిన అశ్విన్.. 365 వికెట్లు తీసాడు. ఒక టెస్టు మ్యాచ్లో పది వికెట్లను ఏడు సార్లు సాధిస్తే.. ఐదేసి వికెట్లను 27 సార్లు తీశాడు. ఈ గణాంకాలు చాలు అశ్విన్ గొప్ప బౌలర్ అనడానికి.
ఇటీవల కాలంలో జట్టుకు దూరమైన రవిచంద్రన్ అశ్విన్.. ఇప్పుడు ఐపీఎల్ 2020లో కనిపించబోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. గత ఏడాది వేలంలో అశ్విన్ను కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వదులకుంది. దీంతో రెండు సీజన్ల పాటు పంజాబ్ను కెప్టెన్గా నడిపించిన అశ్విన్.. తదుపరి సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో కనిపించనున్నాడు. ఐపీఎల్ ట్రాన్స్ఫర్ విండో పద్ధతి ప్రకారం పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం అశ్విన్ను వదులుకున్నందుకు పంజాబ్ జట్టుకు ఢిల్లీ యాజమాన్యం రూ. 1.5 కోట్ల నగదుతో పాటు స్పిన్నర్ జగదీశ సుచిత్ను బదిలీ చేయనుంది. ఇక ఢిల్లీ జట్టులో చేరిన అశ్విన్కు రూ. 7.6 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం.