
చెన్నై: క్రికెట్లో కొత్త నిబంధన తేవాలని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ సరికొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చాడు. ఫ్రీ బాల్ నిబంధన తేవాల్సిన అవసరముందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బౌలర్ బంతిని వదిలే లోపలే నాన్ స్ట్రయికర్ క్రీజును వదిలి ముందుకు వెళితే.. పరుగులు పూర్తి చేసేందుకు అనుమతించకూడదని అతడు సూచించాడు. అలా కాకుంటే తర్వాతి బంతిని 'ఫ్రీ బాల్'గా ప్రకటించేలా నిబంధన తేవాలని అశ్విన్ సూచించాడు. అంటే.. ఫ్రీబాల్కు పరుగులు చేసినా లెక్కలేనట్టు.
2023 వన్డే ప్రపంచకప్ కోసం నిర్వహించే సూపల్ లీగ్లో ఫ్రంట్ ఫుట్నోబాల్ నిర్ణయాన్ని టీవీ అంపైర్కు ఐసీసీ అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రవిచంద్రన్ అశ్విన్ కొత్త ప్రదిపాదనలు ముందుకు తెచ్చాడు. 'ఒకవేళ బౌలర్ బంతి వేసే ముందే నాన్స్ట్రయికర్ క్రీజు దాటితే.. టెక్నాలజీ గమనించి పరుగులను అనుమతించని పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా. బ్యాట్స్మన్ ఇలా చేసిన ప్రతీసారి ఇదే రూల్ ఫాలో కావాలి' అని అశ్విన్ పేర్కొన్నాడు. దీనిపై అశ్విన్ వరుస ట్వీట్లు చేశాడు.
'ఒకవేళ బంతి వేయకముందే నాన్ స్ట్రయికర్ రెండు అడుగులు ముందుకు వెళ్లి.. దానివల్లే రెండు పరుగులు పూర్తి చేయగలిగితే మళ్లీ అదే బ్యాట్స్మన్ స్ట్రయికింగ్కు వస్తాడు. ఆ తర్వాతి బంతికి అతడు ఫోర్ లేదా సిక్సర్ కొడితే.. మొత్తంగా ఐదు లేదా ఏడు పరుగులు సమర్పించుకున్నట్టే. ఒకవేళ ఒక పరుగే వస్తే.. కొత్త బ్యాట్స్మన్ స్ట్రయిక్లోకి వచ్చి డాట్ బాల్ ఆడే అవకాశం ఉంటుంది' అని అశ్విన్ ట్వీట్ చేశాడు.
ఒకవేళ నాన్ స్ట్రయికర్ ముందుకు వెళితే రనౌట్ (మన్కడింగ్) చేసే అవకాశం ఉంటుంది కదా అని ఓ క్రికెట్ అభిమాని అడిగిన ప్రశ్నకి రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. 'ముందుకు వెళ్లడాన్ని అనుమతించకపోయే బదులు.. ఆ తర్వాతి బంతిని బౌలర్కు ఫ్రీబాల్గా ఇవ్వాలి. ఇదే కాస్త న్యాయంగా ఉంటుంది' అని సమాధానమిచ్చాడు. 2019 సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున ఆడిన అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ను మన్కడింగ్ చేయగా కొందరు విమర్శించిన సంగతి తెలిసిందే.
2023 వన్డే ప్రపంచకప్ కోసం నిర్వహించే సూపల్ లీగ్లో ఫ్రంట్ ఫుట్నోబాల్ నిర్ణయాన్ని ఐసీసీ థర్డ్ అంపైర్కు అప్పగించిన సంగతి తెలిసిందే. జూలై 30 నుంచి జరిగే ఇంగ్లండ్, ఐర్లాండ్ వన్డే సిరీస్తో కొత్త నిబంధన అమల్లోకి రానుంది. మరో వైపు వన్డే సూపర్ లీగ్లో స్లో ఓవర్ రేట్కు కూడా శిక్షను కఠినతరం చేశారు. ఇప్పటి వరకు విధిస్తున్న జరిమానా కాకుండా.. ఒక ఓవర్ ఆలస్యమైతే ఒక పాయింట్ కోత విధించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అశ్విన్ ఫ్రీ బాల్ నిబంధనను తెర మీదకు తీసుకువచ్చాడు.