భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నైకి చేరుకున్నాడు. అతనికి ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. బుధవారం రోజు అశ్విన్
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అశ్విన్ స్వదేశానికి వచ్చాడు. చెన్నైలోని అతని ఇంటి వద్ద అభిమానులు కోలాహలం కనిపించింది. అతను కారు దిగగానే కూతురు వెళ్లి తీసుకొచ్చింది. ఈ క్రమంలో బ్యాండ్ మోగిస్తూ అభిమానులు స్వాగతం పలికారు.
ఇంటికి చేరుకున్న అశ్విన్ ను తండ్రి అప్యాయంగా కౌగిలించుకున్నాడు.
ఆ తర్వాత కుటుంబ సభ్యులతో అశ్విన్ అప్యాయంగా మాట్లాడాడు. అతనిపై పూల వర్షం కురిపించారు. ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె)తో తాను సత్తా ఉన్నంత కాలం కొనసాగించాలని యోచిస్తున్నట్లు చెప్పాడు. చాలా మందికి ఇది ఎమోషనల్గా ఉంటుందని పేర్కొన్నాడు. తనకు మాత్రం ఇది గొప్ప రిలీఫ్ అని అన్నాడు. సంతృప్తిని కలిగించిందని చెప్పుకొచ్చాడు. " నేను సీఎస్కే కోసం ఆడబోతున్నాను. నేను ఆడగలిగినంత కాలం ఆడాలని నిర్ణయించుకున్నాను" అని వివరించాడు.

2025 ఐపీఎల్ మెగా వేలంలో అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.9.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వంటి వారితో కలిసి అశ్విన్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అశ్విన్ అంతర్జాతీయ కెరీర్ 2011లో వెస్టిండీస్తో ప్రారంభమైంది.అశ్విన్ 106 టెస్టుల్లో 24 సగటుతోపాటు 2.83 ఎకానమీ రేట్తో 537 వికెట్లు పడగొట్టాడు. భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఒక బౌలర్ గా అశ్విన్ ఉన్నాడు.
అశ్విన్ టెస్టుల్లో 3503 పరుగులు కూడా చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐసీసీ టెస్ట్ నంబర్ 1 బౌలర్ ర్యాంకింగ్ను అనేకసార్లు సాధించాడు. 2010 జూన్ 5 శ్రీలంకతో వన్డే మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు. 116 వన్డే మ్యాచ్ లో 156 వికెట్లు తీయగా.. 707 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అశ్విన్ 65 టీ20 మ్యాచ్ ల్లో 72 వికెట్లు తీశాడు. 184 పరుగులు చేశాడు.