హైదరాబాద్: 2016.. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఎన్నో మధుర స్మృతులను మిగిల్చింది. ఇటీవల ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాడు. అంతేకాదు టెస్టు క్రికెట్లో నెంబర్వన్ ఆల్రౌండర్గా, టెస్టుల్లో నంబర్ 1 బౌలర్గా నిలిచాడు.
ఈ క్రమంలో ఈ ఏడాది అశ్విన్ రెండో బిడ్డకు తండ్రయ్యాడు. అతడి భార్య ప్రీతి నారాయణన్ ఈ నెల 21న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని కొంచెం ఆలస్యంగా ఆమె ట్విట్టర్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. అంతేకాదు ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించింది.
క్యారమ్ బంతులకు అశ్విన్ ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో తన కుమార్తెకు 'క్యారమ్ బేబీ-2'గా ప్రీతి అభివర్ణించింది. 'ఈ నెల 21న క్యారమ్ పాప-2కు జన్మనిచ్చాను. తమిళనాడులో తుపాను, చెన్నైలో ఐదు రోజుల టెస్టు ముగిసే వరకు మా పాప ఎదురు చూసింది. చెపాక్లో విజయానంతరం ఆనందంలో అక్కడే ప్రసవం అయిపోతుందేమో అనుకున్నా. కానీ ఆమె మరుసటి రోజే ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అశ్విన్ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్న సంగతి పక్కకు వెళ్లిపోకూడదన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ ఈ విషయాన్ని దాచిపెట్టాను'' అని ప్రీతి ట్వీట్ చేసింది.
అశ్విన్ భార్య ప్రితీ చెన్నైలో ఈ నెల 21న రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరునాడే చెపాక్ స్టేడియంలో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది.. అయితే, తమకు బిడ్డ పుట్టిన విషయాన్ని ప్రితీ ట్విట్టర్లో సింబాలిక్గా చెప్పింది. కేవలం లవ్ సింబల్ మాత్రమే ఆమె ట్వీట్ చేసింది. తాజాగా ఈ విషయాన్ని చాలా తెలివిగా ప్రితీ వెల్లడించింది.
క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న సందర్భంగా ధోనీ పేరును అశ్విన్ ప్రస్తావించకపోవడంపై ధోనీ అభిమానులు ట్విట్టర్లో అశ్విన్పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో ఆదివారం అశ్విన్ మరొకసారి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు.
'నేను దీనికి ముగింపు పలకాలని అనుకుంటున్నా. నా ఉన్నతికి ధోని ఎంతో కృషి చేశాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ధోని తరువాత టెస్టు కెప్టెన్ బాధ్యతలను కోహ్లి చేపట్టాడు. దాంతో పాటు కొత్త కుర్రాళ్ల కల్గిన భారత జట్టు ఇప్పుడు ఉంది. ఆ క్రమంలోనే ఇప్పటి జట్టును ఉద్దేశించే మాత్రమే నేను ట్వీట్ చేశాను కానీ, ధోనిని పక్కక పెట్టాలని కాదు. ఈ తరహా అవార్డులు తీసుకున్నప్పుడు ముందు కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తాం. తర్వాత జట్టులోని ముఖ్యమైన సభ్యులు పేర్లు మాత్రమే ప్రస్తావిస్తాం అనేది నెటిజన్లు గ్రహించాలి' అని అశ్విన్ విజ్ఞప్తి చేశాడు.
చివరగా ధోని అభిమానులకు అశ్విన్ మరోక విన్నపాన్ని కూడా చేశాడు. తమాషా ట్వీట్లలో తన భార్య పేరును ట్యాగ్ చేయడం మానుకోవాలని ఆమె కీలక పనుల్లో మునిగి ఉందని అశ్విన్ తెలిపాడు. ఆ కీలక పని ఏమిటంటే తమ రెండో బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడమేనంటూ ప్రితీ తెలివిగా వెల్లడించింది.