హైదరాబాద్: 2016 సంవత్సరానికి గాను ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. శనివారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ 937 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు.
పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్టులో 165 పరుగులతో సెంచరీ సాధించిన స్మిత్ పాయింట్లను మరింతగా మెరుగుపరుచుకుని నంబర్ వన్ ర్యాంకును కాపాడుకున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో 71.93 యావరేజితో స్టీవ్ స్మిత్ 1,079 పరుగులు నమోదు చేశాడు. ఇక 875 పాయింట్లతో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్ధానంలో నిలిచాడు.
ఇదిలా ఉంటే మెల్బోర్న్ వేదిగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన పాకిస్థాన్ అజహర్ అలీ కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంక్ను దక్కించుకున్నాడు. టెస్టు ర్యాంకింగ్స్ జాబితాలో పది పాయింట్లను మెరుగుపర్చుకున్న అజహర్ అలీ ఏకంగా ఆరోస్థానానికి ఎగబాకాడు.
ఇక బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అశ్విన్ 887 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, జడేజా 879 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో అశ్విన్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతుండగా, జడేజా మూడో స్ధానంలో ఉన్నాడు.