ఉప్పల్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ తిరిగి పోటీలోకి వచ్చింది. మూడో రోజు ఆటలో పైచేయి సాధించి భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. శనివారం ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు కోల్పోయి 316 పరుగులు సాధించింది. 126 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఒల్లీ పోప్ (148*; 208) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి కోరల్లో నుంచి ఇంగ్లాండ్ను కాపాడి భారత్ విజయానికి అడ్డంగా నిలబడ్డాడు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 421/7తో ఆటను ప్రారంభించిన భారత్ మరో 15 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పది బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో 190 పరుగుల ఆధిక్యం సంపాదించిది. అయితే శనివారం ఆటలో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్లో ఘోర తప్పిదాలు చేశాడు. సులువైన క్యాచ్లను ఏమీ వదిలిపెట్టలేదు. కానీ, బౌండరీ లైన్లో అనుభవం లేని ఆటగాడిలా ప్రవర్తించాడు. పేలవ ఫీల్డింగ్తో ఇంగ్లాండ్కు పరుగులు సమర్పించాడు.

పోప్ మిడ్ ఆన్లో ఆడిన షాట్ను ఆపడానికి అశ్విన్ బౌండరీ లైన్ వరకు పరిగెత్తాడు. అయితే దాన్ని డైవ్ చేస్తూ అందుకోవాలని ప్రయత్నించాడు. కానీ చేతుల్లో నుంచి బాల్ జారిపోయింది. ఆ తర్వాత కాలుతో ట్రై చేసినా లాభం లేకపోయింది. కాసేపటికీ జడేజా బౌలింగ్లో పోప్ మరో షాట్ ఆడాడు. దాని కోసం అశ్విన్ మరోసారి బౌండరీ రోప్ వరకు పరిగెత్తాడు. అయితే మరోవైపు నుంచి రజత్ పటిదార్ బాల్ కోసం వచ్చాడు. ఇద్దరూ బాల్ దగ్గర వరకు వచ్చి సమన్వయ లోపంతో ఫోర్ ఇచ్చారు.
దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారింది. అశ్విన్ నుంచి ఇలాంటి చెత్త ఫీల్డింగ్ ప్రదర్శన ఇప్పటివరకు చూడలేదని, యాష్కు ఏమైందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఫీల్డింగ్ చూస్తుంటే పాకిస్థాన్ ఫీల్డింగ్ గుర్తుకు వస్తుందని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కీలక మ్యాచ్ల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఒత్తిడితో పేలవ ఫీల్డింగ్ చేస్తారనే విషయం తెలిసిందే. బంతి గాల్లోకి లేచినప్పుడు ఇద్దరు ఆటగాళ్లు పోటాపోటీగా దగ్గరకు రావడం, తర్వాత దాని కోసం ఇద్దరూ కనీస ప్రయత్నం చేయకుండా నిలబడి చూస్తుంటారు. అంతేగాక చాలా సులువైన క్యాచ్ను కూడా ఈజీగా జారవిడుస్తుంటారు. అయితే ఇవాళ ఆటలో అశ్విన్తో పాటు మరికొంతమంది టీమిండియా ప్లేయర్లు మిస్ఫీల్డింగ్ చేశారు.