
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా ఆడాడు. రెండో రోజు ఆట మొదలైన తర్వాత ఆలస్యంగా బంతి అందుకున్న అతను.. వరుస ఓవర్లలో వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీని అవుట్ చేయడంతో అరుదైన ఘనత సాధించాడు. ఇది అశ్విన్కు 688వ అంతర్జాతీయ వికెట్ కావడం గమనార్హం. దీంతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో అతను మూడో స్థానానికి చేరుకున్నాడు.
రెండో రోజు ఆటలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆలస్యంగా బంతి అందించినా అశ్విన్ చెలరేగాడు. అతనితోపాటు ఉమేష్ యాదవ్ కూడా అదరగొట్టాడు. వీళ్లిద్దరూ చెరో మూడు వికెట్లు తీసుకోవడంతో ఆసీస్ నిమిషాల వ్యవధిలోనే ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్లో అశ్విన్ 44 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ను దాటేసి మూడో స్థానానికి చేరుకున్నాడు.

కపిల్ దేవ్ తన కెరీర్లో మొత్తం 687 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు అశ్విన్ ఈ సంఖ్యను దాటేశాడు. అశ్విన్ కన్నా ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. అతని కన్నా ముందు హర్భజన్ సింగ్ (707), అనిల్ కుంబ్లే (953) ఉన్నారు. అశ్విన్ ఇటీవలే టెస్టు క్రికెట్లో 450 వికెట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా తను కుర్రాడిగా ఉన్నప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా అశ్విన్ రాణించాడు. వన్డేల్లో 151, టీ20ల్లో 72 వికెట్లు తీసుకున్నాడు. ఇవన్నీ కలిపితే కపిల్దేవ్ను అశ్విన్ దాటేశాడు.