
లండన్: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్గా యాష్ రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజీలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ ఆరంభ ఓవర్ వేయగా.. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. ఆదివారం సోమర్సెట్, సర్రే మధ్య కౌంటీ మ్యాచ్ మొదలైంది. సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు.
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ముగిశాక భారత ఆటగాళ్లకు మూడు వారాల విరామం ఇచ్చింది బీసీసీఐ. దీంతో కొన్నిరోజులు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లిన రవిచంద్రన్ అశ్విన్కు అనుకోకుండా కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీసుకు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానంను అంగీకరించాడు.
జులై 11(ఆదివారం)న సోమర్సెట్, సర్రే మధ్య మ్యాచ్ మొదలైంది. పిచ్ మందకొడిగా ఉండటంతో సర్రే కెప్టెన్ రోరీ బర్న్స్ కొత్త బంతిని మొదట రవిచంద్రన్ అశ్విన్ చేతికి ఇచ్చాడు. దీంతో 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్గా యాష్ రికార్డు నెలకొల్పాడు. యాష్ తొలిరోజే 28 ఓవర్లు వేయడం గమనార్హం. 5 ఓవర్లు మెయిడిన్ వేసిన అశ్విన్.. 70 పరుగులిచ్చి టామ్ లామన్బి (42) వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచులో అశ్విన్ ఎక్కువగా వైవిధ్యం ప్రదర్శించలేదు. పిచ్ను దృష్టిలో ఉంచుకొని ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు విసిరి బ్యాట్స్మెన్పై ఒత్తిడి తెచ్చాడు.
మ్యాచ్ సాగుతున్నా కొద్ది బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో రవిచంద్రన్ అశ్విన్ తెలివిగా బౌలింగ్ చేశాడు. చెత్త బంతులు ఏమాత్రం వేయలేదు. 25 ఓవర్ల పాటు చక్కని లైన్ అండ్ లెంగ్త్ల్లో బంతులేశాడు. యాష్ కేవలం 5 బౌండరీలే ఇచ్చాడు. తొలిరోజు ఆట ముగిసే సరికి సోమర్సెట్ 98 ఓవర్లకు 280/6తో నిలిచింది. ఇదే మైదానంలో టీమిండియా ఇంగ్లండ్తో నాలుగో టెస్టు ఆడనుంది. గతంలో కౌంటీ క్రికెట్లో నాటింగ్హామ్ షైర్, వొర్సెస్టర్షైర్కు ఆడిన అనుభవం అశ్విన్కు ఉంది.