
చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో అదరగొడుతున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాటు, బంతితో ఇంగ్లీష్ ఆటగాళ్లను ఆటాడిస్తున్న అతడిని ఫాన్స్, మాజీలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. కష్టతరమైన పిచ్పై బ్యాటింగ్, బౌలింగ్ ఎలా చేయాలో అశ్విన్ స్వయంగా చూపిస్తున్నాడని అంటున్నారు. ఇక అశ్విన్ సతీమణి ప్రీతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 'చెప్పేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక మ్యాచ్ను చుట్టేసెయ్' అని ఓ ట్వీట్ చేశారు.
అయితే ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. తమిళ 'సూపర్ స్టార్' విజయ్ నటించిన 'మాస్టర్' పోస్టర్ను ఎవరో మార్ఫింగ్ చేసి.. అశ్విన్ ఫొటోను అతికించారు. 'యాష్ అన్న ఇన్ ది ఆస్ చెపాక్ మాస్టర్' అని టైటిల్ పెట్టారు. 'బౌలింగ్ అండ్ బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ బై రవిచంద్రన్ అశ్విన్' అని టాగ్ లైన్ కూడా జత చేశాడు. ఆ ఫొటో నెట్టింట వైరల్ అయింది. ఆ ఫొటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. 'ఇలా ఎవరు చేశారు?' అని ప్రీతి పోస్ట్ చేశారు. అంతేకాదు ఓ స్మైలీ ఎమోజీని యాడ్ చేశారు.
రెండో టెస్టు మూడో రోజు ఆటలో యాష్ శతకం సాధించిన విషయం తెలిసిందే. సెంచరీ అనంతరం కూడా ప్రీతి స్పందించారు. 'అశ్విన్ ఇప్పుడందర్నీ ట్రోల్ చేస్తున్నాడు' అంటూ లాఫింగ్ ఎమోజీతో ట్వీట్ చేశారు. అశ్విన్ ప్రదర్శనపై విమర్శలు గుప్పించేవారికి పరోక్షంగా ఆమె చురకలు అంటించారు. అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్ఇప్పటికే మూడు వికెట్లు పడగొట్టాడు. భారత్ విజయానికి ఇంకా మూడు వికెట్ల దూరంలో నిలిచింది. 482 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో నాలుగో రోజు లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్లకు 116 పరుగులు చేసింది.
రవిచంద్రన్ అశ్విన్ మూడో రోజు ఆటలో ఓ రికార్డు సాధించాడు. ఒకే టెస్టులో అత్యధిక సార్లు 5 వికెట్లతో పాటు సెంచరీ సాధించిన రెండో క్రికెటర్గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో ఇయాన్ బోథమ్ (5 సార్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ ఈ ఘనతను మూడు సార్లు అందుకున్నాడు. యాష్ తర్వాతి స్థానంలో గ్యారీ సోబర్స్ (2), ముస్తాక్ మహ్మద్ (2), కలిస్ (2), షకిబ్ అల్ హసన్ (2) ఉన్నారు. అంతేకాకుండా చెపాక్ మైదానంలో టెస్టుల్లో భారత తరఫున శతకం సాధించిన రెండో తమిళనాడు ఆటగాడిగా కూడా నిలిచాడు. అంతకుముందు 1986/87లో పాకిస్థాన్పై కృష్ణమాచారి శ్రీకాంత్ 123 పరుగులు సాధించాడు.