హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్లో క్రికెటర్లు పని ఒత్తిడిని సమీక్షించాల్సి ఉందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో పని ఒత్తిడి లేకుండా ఎన్ని మ్యాచ్లు ఆడగలరో అన్నే ఆడించాలని ప్రాంఛైజీలకు చెప్తామని అన్నారు.
స్వదేశంలో ఇంగ్లాండ్ సిరిస్ తర్వాత మిథాలీ రాజ్ వీడ్కోలు!
మూడు టీ20ల సిరిస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ "టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం చక్కని లయతో ఉన్నారు. ఐపీఎల్ సమయంలో సంబంధిత కెప్టెన్లు, ప్రాంఛైజీలతో మేం మాట్లాడతాం. ఈ ఏడాది వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్పై ప్రభావం పడకుండా మ్యాచ్లు ఆడించాలని చెప్తాం" అని అన్నాడు.
"వరల్డ్ కప్కు విశ్రాంతి అవసరం. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరర్డ్ కప్కు ఐపీఎల్ తర్వాత కేవలం 10 రోజుల సమయమే ఉంది. కొన్ని కీలక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఐపీఎల్ సమయంలో పనిభారం, ఫిట్నెస్, నైపుణ్యాలను సమీక్షించాలి" అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా త్వరలో భారత్కు రానుంది. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాలో ఐదు వన్డేలు, రెండు టీ20ల సిరిస్ ఆడనుంది. ఆ తర్వాత మార్చిలో ఐపీఎల్.. ఐపీఎల్ ముగిసిన పది రోజులకు వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్కు బయల్దేరనుంది.