
విరాట్ కోహ్లీ ఫామ్లోకి రావడానికి కేవలం ఒక ఇన్నింగ్స్ మాత్రమే అవసరమని.. ఆసియాకప్ తొలి మ్యాచ్లో కోహ్లీ ఫిఫ్టీ చేస్తే అందరి నోళ్లు మూసుకుంటాయని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. కోహ్లీ కచ్చితంగా తిరిగి తన మోజో అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇకపోతే ఆగస్టు 28న ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో తలపడుతుంది. ఇక కోహ్లీ చివరిసారిగా ఇంగ్లాండ్ పర్యటనలో ఆడాడు. ఆ తర్వాత అతను పూర్తి విరామంలో ఉన్నాడు. వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనలకు కూడా అతను వెళ్లలేదు. ఇక గత కొంత కాలంగా విరాట్ ఫామ్ కోల్పోవడం బాగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కొందరైతే టీ20ఫార్మాట్లో అతనికి జట్టులో చోటు ఎందుకంటూ ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు.
'నేను ఇటీవల విరాట్ కోహ్లీతో మాట్లాడలేదు.. కానీ స్టార్లు ఎప్పుడూ సరైన సమయంలో మేల్కొంటారు. ఆసియా కప్ ద్వారా అతనికి సరైన టైం వచ్చింది. అతను పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో ఒక్క ఫిఫ్టీ చేస్తే చాలు విమర్శించే నోళ్లన్నీ మూతపడతాయి. ఒక్క ఇన్నింగ్స్ వల్ల కోహ్లీ ఆటతీరులో మార్పు వస్తుంది. ఎందుకంటే కోహ్లీకి ఇంకా పరుగుల ఆకలి తగ్గలేదు.' అని రవిశాస్త్రి చెప్పాడు. ఆసియా కప్కు ముందు స్టార్ స్పోర్ట్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవిశాస్త్రి ఈ మేరకు తన అభిప్రాయాలు వెల్లడించాడు. 'కోహ్లీ కంటే ఫిట్గా ఉన్న భారత క్రికెటర్ మరొకడు లేడు.
అతనో పరుగుల యంత్రం.. అతను తన మైండ్ను కరెక్ట్ లయ కుదిర్చితే అతనికి తిరిగి ఫామ్లోకి రావడానికి కేవలం 1 ఇన్నింగ్స్ మాత్రమే అవసరం అని శాస్త్రి పేర్కొన్నాడు. ఇకపోతే ఈ ఏడాది భారత జట్టు మొత్తం 21 టీ20లు ఆడగా.. కోహ్లీ అందులో కేవలం 4 టీ20లు మాత్రమే ఆడాడు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో సిరీస్ల మధ్య కోహ్లీకి చాలా విరామం లభించింది. ఇక కోహ్లీ పాకిస్తాన్పై టీ20లలో మంచి రికార్డును కలిగి ఉన్నాడు. పాకిస్తాన్తో జరిగిన 7 టీ20 మ్యాచ్లలో అతను 77.75 సగటుతో 311పరుగులు చేశాడు. అతను మూడు సార్లు నాటౌట్గా నిలిచాడు. ఆ జట్టుపై 35 ఫోర్లు, ఐదు సిక్సర్లను బాదాడు.