
ముంబై: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా సేవలందించి తాజాగా ఆ పదవి నుంచి వైదొగలిన రవిశాస్త్రి.. ఇక ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆరంభం అయ్యే లెజెండ్స్ క్రికెట్ లీగ్ (ఎల్ఎల్సీ)కి కమిషనర్గా వ్యవహరించనున్నాడు. అయితే ఎల్ఎల్సీ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గల్ఫ్ వేదికగా వచ్చే ఏడాది జనవరీలో ఎల్ఎల్సీ లీగ్ ప్రారంభం కానుంది. రిటైరైన క్రికెటర్ల ఆడేందుకు ఈ టోర్నీని ఏర్పాటు చేసినట్లు సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే రిటైర్ అయిన క్రికెటర్లు రోడ్ సేఫ్టీ సిరీసులో ఆడుతున్న విషయం తెలిసిందే.
'వివిధ దేశాల దిగ్గజాలు ఆడే ఈ టోర్నీ ద్వారా క్రికెట్కు సేవలు అందించేందుకు మరోసారి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. లెజెండ్స్ క్రికెట్ లీగ్లో భాగమయినందుకు ఆనందమే. ఈ టోర్నీ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. భవిష్యత్తులో మరింత ఆదరణ పెరుగుతుందని కచ్చితంగా చెప్పగలను. ఈ లీగ్ ద్వారా దిగ్గజ ఆటగాళ్లు మరోసారి మైదానంలో తలపడనున్నారు. కొత్తగా వాళ్లు నిరూపించుకొవడానికి ఏమీ లేకపోయినా.. దిగ్గజాలు ఆడుతుంటే చూడడం అభిమానులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది' అని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు.
'భారత్ సహా ప్రపంచ క్రికెట్లో రవిశాస్త్రి ఓ దిగ్గజ ఆటగాడిగా నిలిచాడు. ఈ లీగ్ను సరైన మార్గంలో నడిపించేందుకు మాకు ఇంతకన్నా గొప్ప వ్యక్తి దొరకరు. రవిశాస్త్రి పనితీరు బాగుంటుంది'. అతడిపై నమ్మకం ఉంది' అని ఎల్ఎల్సీ సీఈఓ రమన్ రహేజా అన్నారు. అయితే రవిశాస్త్రికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించినా.. కమిషనర్ పదవి గురించి ఎల్ఎల్సీ బోర్డు ఎక్కడా స్పష్టం చేయలేదు. ఈ టోర్నీలో మూడు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇండియా, ఆసియా, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ జట్లు తలపడనున్నాయి.
టీమిండియా క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా రవిశాస్త్రి నాలుగేళ్ల కాల పరిమితి ఆదివారం (నవంబర్ 14) ముగిసింది. టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో భాగంగా సోమవారం రాత్రి నమీబియాతో జరిగిన మ్యాచే టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి చివరిది. 2014లో టీమిండియా డైరెక్టర్గా నియమితుడైన రవిశాస్త్రి.. 2017లో కోచ్గా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత 2019లో మరోసారి అతడి పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. ఇక నవంబర్ 17న ఆరంభం అయ్యే న్యూజీలాండ్ సిరీసుతో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.