చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్లో యంగ్ క్రికెటర్ల హవా సాగుతోంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, సంజు శాంసన్, ధృవ్ జురెల్, ఆయుష్ బదోని, కర్ణ్ శర్మ, రాహుల్ తెవాతియా.. ఇలా యంగ్ ప్లేయర్లందరూ సత్తా చాటుతున్నారు. జాతీయ జట్టులో తలుపు తడుతున్నారు. ఐపీఎల్ ద్వారా లభించిన అవకాశాలను వారంతా సద్వినియోగం చేసుకుంటోన్నారు.
ప్రత్యేకించి- రాజస్థాన్ రాయల్స్ డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కోల్కత నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్.. తమ ప్రత్యేకతను చాటుకుంటోన్నారు. మ్యాచ్- మ్యాచ్కు వారు రాటుదేలుతున్నారు. విన్నర్లుగా నిలుస్తోన్నారు. ఒంటిచేత్తో జట్టును గెలిపిస్తో్నారు. తాజాగా కోల్కత నైట్ రైడర్స్పై జరిగిన మ్యాచ్లో యశస్వి జైస్వాల్ ఏ స్థాయిలో చెలరేగాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు.

ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లను ఆడిన జైస్వాల్ 575 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 167.15 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో స్టేడియంలో పరుగుల వరదను పారిస్తోన్నాడీ లెఫ్ట్ హ్యాండర్. 2020లో ఐపీఎల్లో అడుగు పెట్టిన ఈ యంగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ అతి తక్కువ సమయంలో 1,000 పరుగుల ల్యాండ్ మార్క్ను అందుకున్నాడు. 35 మ్యాచ్లల్లో 1,122 పరుగులు చేశాడు.
రింకూ సింగ్ కూడా తక్కువేమీ కాదు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లను ఆడిన రింకూ 353 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 146.47. ఈ సీజన్లో వారిద్దరూ నిలకడగా రాణిస్తోండటం బోనస్. వికెట్ పడకుండా క్రీజ్లో శరవేగంగా పాతుకునిపోవడం, ఎలాంటి బౌలర్నయినా ధీటుగా ఎదుర్కొనడం వారి ప్రత్యేకత.

తమ బ్యాటింగ్ శైలిలో జాతీయ జట్టులో చోటు కోసం కర్ఛీఫ్ వేసుకున్నట్టే కనిపిస్తోంది యశస్వి జైస్వాల్, రింకూ సింగ్. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ధృవీకరించారు. వారిద్దరినీ జాతీయ జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. ఈ దిశగా బీసీసీఐ సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రావాలని సూచించారు. ఎంత త్వరగా వారిని జాతీయ జట్టులోకి తీసుకుంటే అంత బెటర్ అని వ్యాఖ్యానించారు.
2024లో జరిగే టీ20 ప్రపంచకప్ నాటికి వారు జాతీయ జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. టీ20 వరల్డ్ కప్ కోసం వారిని సన్నద్ధం చేయడంలో భాగంగా ఇప్పటి నుంచే టీమిండియాలో చోటు కల్పించాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్/నవంబర్లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం కూడా వారిని జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జైస్వాల్, రింకూసింగ్ వంటి ప్లేయర్ల గురించి కాకపోతే ఇంకెవరి కోసం సెలెక్టర్లు ఆలోచిస్తారని తేల్చి చెప్పారు.