
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021లో టైటిల్ ఫెవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా.. పూర్తిగా నిరాశపర్చింది. మెగా టోర్నీలో కనీసం సెమీస్కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. అగ్రశ్రేణి జట్లయిన పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాల తర్వాత పసికూనలైన అఫ్గనిస్థాన్, స్కాట్లాండ్, మీబియాపై భారత్ భారీ విజయాలు అందుకుంది. అయినా కోహ్లీసేన సెమీస్కు చేరుకోలేకపోయింది. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి నమీబియాతో భారత జట్టు చివరి నామమాత్రపు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. టోర్నీలో టీమిండియా సెమీస్కు చేరుకోకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు.
సుదీర్ఘ కాలం బయోబబుల్లో ఉండటం.. ఐపీఎల్ ఆడిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2021 ఆడడంతో భారత క్రికెటర్లు పూర్తిగా అలసిపోయారని, అందువల్లనే కోహ్లీసేన మొదటి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై లీగ్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చిందని హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. టీ20 ప్రపంచకప్ ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్తో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'భారత జట్టు గత ఆరు నెలలుగా కరోనా నిబంధనలు పాటిస్తూ బయో బబుల్లో ఉంటోంది. నేను మానసికంగా మాత్రమే అలసిపోయా. ఆటగాళ్లు మాత్రం మానసికంగా, శారీరకంగా కూడా అలిసిపోయారు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ టోర్నీల మధ్య ఇంకాస్త ఎక్కువ వ్యవధి ఉంటే బాగుండేది. మా వైఫల్యానికి దీన్ని కారణంగా చూపట్లేదు. మీ టోర్నీ ఓటమికి భయపడట్లేదు. గెలవాలని చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు ఓటములు ఎదురవుతాయి' అని అన్నాడు.
'నేను ప్రధాన కోచ్ పదవి చేపట్టినప్పుడు టీమిండియాలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నా. కచ్చితంగా మార్పులు తీసుకొచ్చాననే భావిస్తున్నా. గత ఐదేళ్లలో భారత ఆటగాళ్లు అన్ని దేశాల్లో, మూడు ఫార్మాట్లలో రాణించిన తీరు చూస్తే.. క్రికెట్ చరిత్రలో ఇది ఒక గొప్ప జట్టుగా నిలుస్తుంది' అని హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే (నవంబర్ 14) రవిశాస్త్రి టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి వైదొలిగిపోనున్నాడు. శాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. టీమిండియా ఆడబోయే తదుపరి మ్యాచ్లకు ద్రవిడ్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. న్యూజీలాండ్ పర్యటన ద్వారా రాహుల్ రంగంగంలోకి దిగనున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీని భారత్ ఘన విజయంతో ముగించింది. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్లో నమీబియాపై భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటర్లు, బౌలింగ్లో ఆధిపత్యం కనబరిచిన భారత్ సునాయాస విజయంతో ఇంటిముఖం పట్టింది. వరుసగా మూడు విజయాలు సాధించినా కోహ్లీసేన సెమీస్ బెర్తు సాధించలేకపోయింది. గ్రూప్-2 నుంచి పాకిస్తాన్, న్యూజీలాండ్ సెమీస్కు చేరుకున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 జట్టు పగ్గాలను వదిలేస్తానని ప్రకటించిన విరాట్ కోహ్లీకి, హెడ్ కోచ్గా పదవీకాలం ముగిసిన రవిశాస్త్రికి ఘన వీడ్కోలు చెప్పినట్టైంది.