గతేడాది టీ20 వరల్డ్ కప్లో టీమిండియా పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తన గ్రూప్లోని బలహీన జట్లపై విజయాలు సాధించిన భారత జట్టు.. సెమీఫైనల్లో బలమైన ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి సెలెక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మను పదవి నుంచి తొలగించారు కూడా.
అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ అతన్నే ఆ పదవిలో నియమించారు. అనంతరం జరిగిన స్టింగ్ ఆపరేషన్లో బీసీసీఐకి సంబంధించిన పలు అంశాలపై చేతన్ శర్మ నోరు జారాడా. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా కూడా చేశాడు. ఈ క్రమంలో తను టీమిండియా హెడ్కోచ్గా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా సెలెక్షన్ కమిటీ మీటింగ్లో పాల్గొనలేదని ఇటీవలే రవిశాస్త్రి వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సమావేశాలను కూడా బ్రాడ్కాస్ట్ చేయాలని కొందరు బీసీసీఐ అధికారులు అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై టీమిండియా మాజీ హెడ్ కోచ్, లెజెండరీ ప్లేయర్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు ఈ మీటింగ్స్ ఎలా జరుగుతాయో తనకు కూడా చూడాలని ఉందని, కాబట్టి వీటిని బ్రాడ్ కాస్ట్ చేయడం చాలా మంచి నిర్ణయం అని చెప్పాడు.
ప్రస్తుతం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తాత్కాలిక చీఫ్గా శివ్ సుందర్ దాస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన తర్వాత కొత్త సెలెక్షన్ కమిటీ చీఫ్ను బీసీసీఐ ఎన్నుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెలెక్షన్ కమిటీ మీటింగ్స్ను కూడా బ్రాడ్కాస్ట్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
'లైవ్లో సెలెక్షన్ కమిటీ మీటింగ్ చూడాలనేది నా కల. సెలెక్షన్ మీటింగ్ జరిగేటప్పుడు బాక్సాఫీస్ ఎలా బద్దలవుతుందో ఊహించగలరా? సెలెక్టర్లు కూడా చాలా నిబద్ధతతో పనిచేయాల్సి వస్తుంది. జట్టు ఎంపికలో పారదర్శకత ముఖ్యం అనుకుంటే.. త్వరలోనే ఇది జరిగి తీరుతుంది. సెలెక్షన్ మీటింగ్ బ్రాడ్కాస్ట్ హక్కులను కూడా అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది. దాని వల్ల వచ్చే ఆదాయం వల్ల సెలెక్టర్ల జీతాలు కూడా ఐదు రెట్లు పెరుగుతాయి' అని జోస్యం చెప్పాడు.